Swarnagiri | భువనగిరి కలెక్టరేట్, మార్చి 6 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి జ్యువెల్లర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో త్రిదండి చినజీయర్స్వామి నేతృత్వంలో బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణలు, హోమాది క్రతువులతో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం వేలాది మంది భక్తుల నడుమ చేపట్టారు.
వారం రోజుల నుంచి వేద బ్రాహ్మణులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ నేతృత్వంలో సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయానికి ‘స్వర్ణగిరి’ అని నామకరణం చేశారు. కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంభిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది.