తుక్కుగూడ, ఏప్రిల్ 28 : ప్రజల గొంతుకను గుర్తించే ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ సమస్యలు ఉండవని తెలంగాణలో రుజువు అవుతుంది. దశాబ్దాలుగా విద్యుత్ సమస్యతో బాధ పడ్డ తెలంగాణ ప్రజలు గత ఆరేండ్లుగా విద్యుత్ సమస్య లేకుండా కంటినిండా నిద్రపోతున్నారు. ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను చేస్తుండడంతో తుక్కుగూడ ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏమాత్రం అంతరాయం లేకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే వేసవికాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పెరిగిన విద్యుత్ వినియోగాన్ని తట్టుకునే విధంగా విద్యుత్ ఫీడర్లకు అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు.
అనుకోకుండా విత్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అప్పటికప్పుడు విద్యుత్ను పునరుద్ధరించేందుకు ప్రత్యేక మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. తుక్కుగూడ, మహేశ్వరం, పహడీషరీఫ్ ఏడీఈ కార్యాలయం పరిధిలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఏడీఈ కార్యాలయం పరిధిలో మొత్తం 33/11 కేవీ సబ్స్టేషన్లు 26 ఉండగా ఇటీవలే రావిరాలలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 27కు చేరుకుంది. మంకాల్ ప్లాస్టిక్ పార్కులో మరో 33/11కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వేసవిలో గృహ అవసరాలతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా అధికారులు నిరంతరం విద్యుత్ను అందజేస్తున్నారు. సాధారణ సమయాల్లో 34 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా వేసవిలో డిమాండ్ పెరగడంతో 45 మెగావాట్లకు చేరుతుందని అధికారులు పేర్కొన్నారు. దాదాపు లక్షా ఇరవై వేల యూనిట్ల విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యాన్ని పెంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.