7.149 కోట్ల యూనిట్లకు చేరిన రోజువారీ విద్యుత్ వినియోగం
హైదరాబాద్లో నిరంతరం నాణ్యమైన సరఫరా
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్ కోతలతో దేశంలోని పలు రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతున్నది. గత 3-4 రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి.
గత నెల 27న 7.149 కోట్ల యూనిట్ల విద్యుత్ (71.49 మిలియన్ యూనిట్లు) వినియోగం జరుగగా.. గరిష్ఠంగా 3400 మెగావాట్ల డిమాండ్ నమోదైందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు తెలిపారు. మున్ముందు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. ఎంత డిమాండ్ పెరిగినా.. దానికి అనుగుణంగా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
రెండు రోజులు తేలికపాటి వర్షం
గత రెండు రోజులు 42డిగ్రీలకు చేరువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఉపరితల ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీలు నమోదవ్వగా సోమవారం నాటికి 0.6డిగ్రీలు తగ్గి 40.9డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయి కంటే 7.8డిగ్రీలు పెరిగి 28.8డిగ్రీల సెల్సియస్గా నమోదైందని చెప్పారు. ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతుండటంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.