మాదాపూర్ : చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Gandhi ) అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ (Hafizpet division) పరిధిలోని ఈర్ల చెరువుల సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనుల్లో భాగంగా రూ. 7.73 కోట్లతో అంచనా వ్యయంతో చేపడుతున్న మురుగు నీరు మళ్లింపు నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశాలి నగర్ నుంచి ఈర్ల చెరువు అలుగు వరకు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. చుట్టు ప్రక్కల కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
మురుగు నీటి కాల్వపై స్లాబ్లు వేయాలని సూచించారు. చెరువు సుందరీకరణ పనులు, చెరువు కట్ట బలోపేతం, వాకింగ్ ట్రాక్ వంటి పనులను చేపడుతామన్నారు.చెరువులు కబ్జాలకు గురికాకుండా సంరక్షిస్తామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, బాబు మోహన్, మల్లేష్, మల్లేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.