దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం క్రమంగా పెరుగు తున్నది. ఇక మెట్రో నగరాల్లో అయితే వాయుకాలుష్య తీవ్రత రెట్టింపు అవుతుండగా.. హైదరాబాద్లో మాత్రం సాధారణ స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే సీపీసీబీ వాయుకాలుష్య నియంత్రణలో దేశ ప్రజల భాగస్వామ్యంతో పాటు పాటించాల్సిన పద్ధతులపై తగు సూచనలు జారీ చేసింది.
సాధారణంగా కొందరు వ్యక్తిగత వాహనాలను నిర్ణీత కాలంలో సర్వీసింగ్ చేయించరు. అలాగే చెడిపోయిన ఎయిర్ ఫిల్టర్స్ను యథావిధిగా వినియోగిస్తుంటారు. ఇంకొందరు ఫిట్నెస్ గడువు ముగిసినా వాహనాలను వినియోగించడం వల్ల భారీగా పొగ వెలువడుతుంది. అలాగే సిగ్నల్స్ వద్ద ఎక్కువగా రేస్ చేయడం, ఇంజిన్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చు కావడంతో పాటు ఎక్కువగా పొగ వెలువడుతుంది. ఇలా చేయడం వలన వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు వాయుకాలుష్యం పెరుగుతుంది. మరోవైపు బల్క్డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, పలు రకాల మధ్య తరగతి పరిశ్రమల వాయుకాలుష్యం కూడా పెరుగుతున్నదని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు.
వాయు కాలుష్యం పెరుగుతున్న తరుణంలో ప్రజలు సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి ప్రజారవాణా వాహనాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. సుమారు 100 మంది ప్రయాణం చేసే ఒక వాహనం నుంచి వెలువడే కాలుష్యం… ఒకరిద్దరు/ఐదారుగురు మాత్రమే ప్రయాణించే రెండు, మూడు వ్యక్తిగత వాహనాల కాలుష్యానికి సమంగా ఉంటుందని పీసీబీ సైంటిస్ట్లు పేర్కొంటున్నారు.
హైదరాబాద్లోని దాదాపు 6 స్టేషన్ల ద్వారా నమోదు చేసిన గాలి కాలుష్యం సాధారణ స్థాయిలో ఉందని నేషనల్ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ మంగళవారం జారీ చేసిన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ యూనివర్సిటీ, సనత్నగర్, ఇక్రిశాట్, ఐడిఏ పాశమైలారం ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిలో ఉండగా, జూ పార్కు ప్రాంతంలో మాంత్రం 103 సూచితో ఓ మోస్తరుగా కాలుష్యం ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్లో నూతనంగా పార్కులు అభివృద్ధి చేయడంతో పాటు, రిజర్వు ఫారెస్ట్ల ఏర్పాటుతో పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.