Lok Sabha Elections | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.12.97 కోట్ల మేర నగదును ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
రూ. కోటి 86 లక్షల విలువజేసే ఇతర వస్తువులు, 19.82 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. 146 కేసులు నమోదు చేసి, 141 మందిని అరెస్టు చేశామన్నారు. నగదు, ఇతర వస్తువులపై 296 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్కరించామన్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.10.17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.