సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : తక్కువగా చదువుకున్న యువతనే లక్ష్యంగా చేసుకొని కొన్ని జాబ్ కన్సల్టెన్సీలు మోసం చేస్తున్నాయి. ఎలాంటి నియమాలు పాటించకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోని కన్సల్టెన్సీలు యువతను విదేశాలకు పంపిస్తామంటూ నమ్మిస్తూ వారిని నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల నిజామాబాద్, హైదరాబాద్కు చెందిన యువకులను పోలాండ్ పంపిస్తామంటూ నమ్మించిన అబ్రాడ్ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ తమను తీవ్రంగా నష్టపర్చడమే కాకుండా విదేశాల్లో నరకయాతన అనుభవించేలా చేశారంటూ కొందరు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
నగర పోలీసులు నకిలీ కన్సల్టెన్సీలపై తరుచూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నారు. టెన్త్, ఇంటర్ చదివిన వాళ్లే లక్ష్యంగా గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తామంటూ గ్రామాల్లోకి వెళ్లి కొన్ని కన్సల్టెన్సీల దళారులు ప్రచారాలు చేస్తున్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు జిల్లాలో కమీషన్లు ఆశ చూపి, దళారులను తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కన్సల్టెన్సీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి, కన్సల్టెన్సీల నిర్వహణకు నియమ నిబంధనలుంటాయి, ఆయా నియమాలను అనుసరించే కన్సల్టెన్సీలను సంప్రదించాలని పోలీసులు తరుచూ సూచనలు చేస్తున్నారు. అయినా కూడా నకిలీ కన్సల్టెల్సీల బారినపడి నిండా మోసపోతున్నారు.
తాత్కాలిక వీసాలపై..
కన్సల్టెన్సీలు చేసే ప్రచారాన్ని నమ్మి వచ్చే వారిని కొన్ని కన్సల్టెల్సీలు నిండా ముంచేస్తున్నాయి. మీరు మాకు డబ్బు కట్టండి, నెల రోజుల్లో వీసా మీ చేతుల్లో ఉంటుందంటూ నమ్మిస్తారు. అక్కడ మనవాళ్లు అన్నీ చూసుకుంటారు.. సంవత్సరం పాటు వీసా గడువుంటుంది.. ఈ సంవత్సరం లోపు మీకు తాత్కాలిక రెసిండెంట్, పర్మినెంట్ రెసిండెంట్గా అనుమతి ఇప్పిస్తాం.. దీంతో మీరు అక్కడ మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ మాయమాటలు చెబుతున్నారు. పదో తరగతి చదివిన వాళ్లు నెలకు రూ.80వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశముంటుందంటూ నమ్మిస్తూ వారి వద్ద నుంచి లక్షల్లో ఫీజులు లాగేస్తున్నారు. డబ్బు మొత్తం చెల్లించిన తరువాత వీసా ప్రాసెసింగ్ మొదలు పెడుతున్నారు.
నెలల తరబడి కన్సల్టెన్సీల చుట్టూ తిప్పుతూ, ఏదో ఒక దేశానికి వీసా నెల రోజుల పాటు ఇచ్చి పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన తరువాత ఆయా కన్సల్టెన్సీల నిర్వాహకులు ఎవరినీ పట్టించుకోరు. కొన్నిసార్లు వీసాపై ఒక దేశానికి వెళ్లిన తరువాత, ఆ దేశం నుంచి తిరిగి మరో దేశానికి అడ్డదారిలో పంపిస్తున్నారు. ఇందుకు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే ఉదాహరణ. పోలాండ్ అంటూ సెర్బియాకు తీసికెళ్లిన కన్సల్టెన్సీ నిర్వాహకులు కొంత మందిని ఆ దేశం నుంచి మరో దేశానికి ‘డాంకీ ప్రాసెస్’లో తరలించేందుకు విఫలయత్నం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
నకిలీలపై పోలీస్ ఫోకస్
నకిలీ కన్సల్టెన్సీలపై నగర పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీఎస్లో నమోదైన కేసుతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నకిలీ కన్సల్టెన్సీల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని కన్సల్టెన్సీల నిర్వాహకులు దేనికైనా సిద్ధమవుతుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. అర్హత లేకున్నా డబ్బు కోసం అమాయకులను నమ్మించి విదేశాలకు పంపుతున్న కన్సల్టెన్సీలు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. కన్సల్టెన్సీలు పాటించాల్సిన నియమ నిబంధనలు పాటిస్తున్నాయా? అనే విషయంపై దృష్టి పెట్టారు. నకిలీ కన్సల్టెన్సీల నిర్వాహకంపై అమాయకులకు నష్టం కలుగకుండా ఉండేలా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.