ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీస్ పోస్టులు పెంపు కోరుతూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతున్నది. బారికేడ్లు ఏర్పాటు చేసి.. అడుగడుగునా బలగాలను మోహరించి.. నిరుద్యోగులను అడ్డుకుంటున్నారు. దీంతో అశోక్నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ ఏరియాలు.. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీ, హాస్టళ్లపై నిఘా పెడుతూ.. అనుమానం వచ్చిన వారి వివరాలను సేకరిస్తూ.. నిరుద్యోగులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
-చిక్కడపల్లి
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు చేయాలని, పోలీసు పోస్టులు 20వేలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా నిరుద్యోగులు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం ప్రసన్న హరి కృష్ణ నేతృత్వంలో అశోక్నగర్లో నిరుద్యోగ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ నేతలు కయ్య వెంకటేశ్, రవి కుమార్, ఇంద్ర, అస్మా, కిరణ్, బాల కోటి, తదితరులను తెల్లవారు జామున 6 గంటలకే అరెస్టు చేశారు.
బారికేడ్లు ఏర్పాటు చేసి..
చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీని అశోక్నగర్ను పోలీసులు నిర్భందించారు. లైబ్రరీ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన అభ్యర్థుల వివరాలను సేకరించారు. తెల్లవారు జామునే రూమ్స్, హాస్టళ్లుపై నిఘా పెట్టి ఉదయాన్నే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి వేళల్లో వదిలిపెడుతున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని అడిగితే తమను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.