CP Kothakota Srinivas Reddy | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): శ్రీ రామ నవమి శోభాయాత్రకు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, నిర్వాహకులు పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి శుక్రవారం మంగళ్హాట్ సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్స్లో ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ విభాగాలు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ తదితర శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీరామ నవమి ఊరేగింపు జరిగే 6.8 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు. శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శోభాయాత్రలో రాజకీయ జెండాలు, రాజకీయ ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, అదనపు సీపీ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోన్ కమిషనర్ హేమంత్ సహదేవ్రావు, డీసీపీలు, ఇతర శాఖల అధికారులతో పాటు ఉత్సవ సమితి సభ్యులు భగవంతరావు, కృష్ణ, ఆనంద్ సింగ్, గోవింద్రాఠీ కిరోడి మాల్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే శ్రీరామ నవమి వేడుకలు, శోభాయాత్ర నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి నగర పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై హనుమాన్ వ్యాయమ శాల వరకు కొనసాగుతుందని, ఈ ర్యాలీకి నగరంతో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి వచ్చే ర్యాలీలు కలుస్తాయని సూచించారు. సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఎస్హెచ్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ శ్రీనివాస్రెడ్డి సూచించారు.