వనస్థలిపురం, ఆగస్టు 30: “మీ కార్లను సెల్ఫ్ డ్రైవింగ్కు తిప్పి.. ప్రతినెలా మీకు అద్దె చెల్లిస్తామని” నమ్మబలికాడు. యజమానుల వద్ద కార్లు తీసుకొని.. వాటిని వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్ఘాట్కు చెందిన శంకులోల్ల నాగరాజు (34) బైరామల్గూడలో శివప్రకాశ్ ట్రావెల్స్ ఏర్పాటు చేశాడు. సెల్ఫ్ డ్రైవింగ్కు కార్లను అద్దెకు ఇస్తున్నాడు. ఇందుకు పలువురు యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకొని.. వారికి నెలనెలా అద్దె చెల్లిస్తున్నాడు.
ఈ వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ క్రమంలోనే అతడికి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో బెట్టింగులు, ఇతర వ్యాపారాల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. అప్పులు కావడంతో తన వద్దనున్న ఇతరుల కార్లను సూర్యాపేట జిల్లా బేతవోలుకు చెందిన వడ్డీ వ్యాపారి బెక్కం వెంకటేశ్ వద్ద తాకట్టు పెట్టి పది రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. యజమానులకు కార్లు చూపించకుండా, అద్దె చెల్లించకుండా దాటవేస్తున్నాడు. దీంతో చింతలకుంట నివాసి బట్టు జానయ్య వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నిందితులు నాగరాజు, వెంకటేశ్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వీరికి సహకరించిన రామారావు, శివ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.20 కోట్ల విలువజేసే 10 కార్లు స్వాధీనం చేసుకున్నారు.