సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్యురాలి కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరికొందరి కోసం ఆదిభట్ల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు, అతడి గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు చుట్టూ ఉన్న జిలాల్ల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఈ ఘటనలో నవీన్రెడ్డి, అతడి అనుచరులు వ్యవహరించిన తీరు భయంకరంగా ఉంది. దీంతో అతడికి గతంలో నేర చరిత్ర ఉందా.! అతడికి సహకరించిన వారిలో నేరస్తులు ఉన్నారా..! అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాగన్నగూడలోని సిరిటౌన్షిప్లో ఉంటున్న రిటైర్ ఆర్మీ ఉద్యోగి దామోదర్రెడ్డి ఇంటిపై శుక్రవారం దాదాపు వంద మందితో కలిసి వచ్చిన నవీన్రెడ్డి దాడి చేసి, ఆయన కుమార్తె (డాక్టర్)ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. బాధితులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తొలుత కిడ్నాప్నకు గురైన వైద్యురాలిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
రాచకొండతో పాటు చుట్టూ ఉన్న మిగతా జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఆదిభట్ల పోలీసులు కిడ్నాపర్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, వారి సెల్ఫోన్లను ట్రాక్ చేస్తూ కొన్ని గంటల వ్యవధిలోనే కిడ్నాప్నకు గురైన బాధితురాలిని రక్షించారు. కిడ్నాప్, దాడికి పాల్పడిన నిందితుల్లో 32 మందిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే, ప్రధాన సూత్రధారి నవీన్రెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడితో పాటు మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. సైకోగా వ్యవహరించిన నవీన్రెడ్డి చేసిన దౌర్జన్యాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నవీన్రెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందా.. అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లతో పాటు నల్గొండ, ఇతర జిల్లాల్లోనూ నవీన్రెడ్డి నేరాలకు సంబంధించి ఆరా తీస్తున్నారు.