సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): సినిమా షూటింగ్లో అపశృతి దొరిలింది. యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఓ గుర్రం మృతిచెందింది. ఈ ఘటనపై ‘పెటా’ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇవి.. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో అనాజ్పూర్ గ్రామంలో మద్రాస్ టాకీస్ సమర్పణలో పొన్నియిన్ సెల్వన్ తమిళ సినిమా షూటింగ్ జరుగుతున్నది. అనాజ్పూర్ గ్రామంలో యుద్ధానికి సంబంధించిన చిత్రీకరణ చేపట్టారు.
చిత్ర నిర్వాహకులు సుమారు 40 నుంచి 50 గుర్రాలను తీసుకువచ్చి వాటితో షూటింగ్ నిర్వహిస్తుండగా, ఓ గుర్రం మృతి చెందింది. విషయం పెటా సంస్థ ప్రతినిధుల దృష్టికి రావడంతో వారు అబ్దుల్లాపూర్మెట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. గుర్రం అనారోగ్యంతో ఉన్నా.. దానితో మరో గుర్రంతో ఢీకొట్టే దృశ్యాన్ని చిత్రీకరించడం వల్లే చనిపోయిందన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 పీసీఏ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేశారు. పూర్తి విచారణ జరిపిన తర్వాత చర్యలు ఉంటాయని తెలిపారు.
ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గుర్రం చనిపోవడానికి చోటుచేసుకున్న సంఘటన దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు ఏమైనా ఉంటే వాటిని పెటాకు పంపిస్తే వారికి 25 వేల నగదును అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ దృశ్యాలను Info@petaindia. org కు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆధారాలతో జంతువులను హింసిస్తున్న వారిపై కఠన చర్యలు తీసుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు.