ఉస్మానియా యూనివర్సిటీ : దివ్యాంగులమని కుంగిపోకుండా, అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య పిలుపునిచ్చారు. బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఫౌండేషన్ డే వేడుకులను ఉస్మానియా యూనివర్సిటీలోని మెకాస్టార్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా లభించే అన్ని రకాల హక్కులను పొందే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. దివ్యాంగుల హక్కులకు ఇతర సామాన్య ప్రజల ద్వారా విఘాతం కలిగినట్లెతే మావన హక్కుల కమిషన్ ద్వారా పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. దివ్యాంగులు సైతం అన్ని విభాగాలలో ముందుకు సాగేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. రాజకీయాలలో అవకాశాలు కల్పించేందుకు కూడా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు సుతారపు రవీందర్, డాక్టర్ చిక్క హరీశ్, యాదయ్య, అనిల్కుమార్, కృష్ణవేణి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.