సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): దొంగతనాలు, కల్తీ విత్తనాల అమ్మకాలు, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడిన నిందితులపై రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు బుధవారం ఏడుగురిపై పీడీ యాక్ట్ను విధించారు. ఏడుగురి నేరప్రవృత్తిని దృష్టిలో పెట్టుకుని తిరిగి అదే నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రజలను కాపాడేందుకు సీపీలు మహేశ్ భగవత్, సజ్జనార్ వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో, నిందితులు ఏడాది పాటు జైలులో ఉండనున్నారు. రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఇటీవల నకిలీ విత్తనాల కేసుల్లో పట్టుబడ్డ గోపాల కిశోర్ సురేఖ, రాజారెడ్డి, శ్రీధర్రెడ్డి, దొంగతనాలకు పాల్పడి దొరికిన లక్ష్మణ్, శివరాత్రి రోజు రేవ్ పార్టీ నిర్వహించి, 90 మంది యువతీ యువతులకు మత్తు పదార్థాలు సరఫరా చేసిన శ్రీకర్రెడ్డి, శరత్చంద్ర, గిరీశ్లపై పీడీ యాక్ట్ను విధించారు. ప్రస్తుతం వీరందరూ చర్లపల్లి జైలులో ఉన్నారు.