ఖైరతాబాద్, ఫిబ్రవరి 8 : సొంత భావనే దోచుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కాయ్యాడు. ప్రధాన సూత్రధారితో పాటు పాత్రదారులైన ఆరుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పంజాగుట్ట పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ ఎస్. మోహన్ కుమార్ వివరాలను వెల్లడించారు. యూసుఫ్గూడలోని నవోదయ కాలనీకి చెందిన బీవీ మురళీకృష్ణ వ్యాపారం చేస్తాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 4న లాల్బంగ్లా వద్ద ఓ ప్రైవేట్ స్కూల్లో తన పిల్లలిద్దరిని దించాడు. తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా, అక్కడే కాపుకాసిన విజయవాడకు చెందిన అబ్దుల్ సలీం (30), పల్లపు లక్ష్మయ్య (31), అన్నపాగె కృష్ణ గోపాల్ అలియాస్ కిట్టు (27), శ్రీనివాస్ అలియాస్ వాసు (35), గౌస్ తాము ఐటీ అధికారులమని వెంటరావాలని బలవంతంగా ఇన్నోవా కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా కొట్టారు. రామోజీ ఫిల్మ్సిటీ సమీపంలోని బాట సింగారం వద్ద కారు ఆపి భార్య ఫోన్ నంబర్ తీసుకున్నారు. వెంటనే రూ.60 లక్షలు చెల్లిస్తే భర్తను విడిచి పెడుతామంటూ చెప్పారు. అంత డబ్బు తమ దగ్గర లేదని రూ.30లక్షల వరకు ఇస్తానని చెప్పగా.. వెంటనే పంపించాలన్నారు. ఆమె ఈ విషయాన్ని ముషీరాబాద్లో ఉండే తన సోదరుడు డి.రాజేశ్ (36)కు చెప్పింది. ఆ మొత్తం డబ్బులను రాజేశ్కు ఇచ్చి వారు సూచించిన నాంపల్లి స్టేషన్కు పంపించింది. అనంతరం మురళీకృష్ణను వారు హయత్నగర్ వద్ద వదిలి వెళ్లిపోయారు.
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ‘భావమరిది రాజేశ్’దే…
భావ మురళీధర్ వ్యాపారి కావడంతో నేరుగా డబ్బులు అడిగితే ఇవ్వడు… దీంతో కిడ్నాప్కు తెరలేపాడు భావమరిది రాజేశ్. రెండు వారాల క్రితమే వరుసకు తనకు సోదరుడయ్యే విజయవాడకు చెందిన డి. రాఘవేంద్ర (33), మరో పరిచయస్తుడు పిల్ల నాగ జీవన్ కుమార్ (30)తో కలిసి ఈ కిడ్నాప్ తతంగాన్ని రచించి పలువురితో ముఠా తయారు చేసుకున్నాడు. గత నెల 26న విజయవాడ నుంచి ఇన్నోవాను సైతం హైదరాబాద్కు తెప్పించుకున్నాడు. 27న భావ వెళ్లి వచ్చే ప్రాంతం, సమయంపై రెక్కీ సైతం నిర్వహించారు. ఈ నెల 4న తమ ప్లాన్ను అమలు చేశాడు. సొంత భావను కిడ్నాప్ చేయించి, అక్కను మభ్యపెట్టి రూ.30లక్షల డబ్బును పోగేసుకున్నాడు.
దర్యాప్తులో నాలుగు బృందాలు..
ఐటీ అధికారుల పేరుతో కిడ్నాప్ జరుగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. సీఐ హరిశ్చంద్రా రెడ్డి, డీఐ దుర్గారావు పర్యవేక్షణలో డీఎస్సైలు నరేశ్, రఫీయుద్దీన్ నేతృత్వంలో నాలుగు బృందాలు దర్యాప్తు చేశాయి. బాటసింగారం, హయాత్నగర్ తదితర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు, సెల్ ఫోన్ సిగ్నళ్లను ట్రాక్ చేశారు. నిందితులు బుధవారం హైదరాబాద్కు వస్తున్నట్లు పక్కా సమాచారంతో ముషీరాబాద్ వద్ద ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15,04,500, ఇన్నోవా, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లను సీజ్ చేశారు. ఈ మేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ మోహన్ కుమార్ తెలిపారు.