బంజారాహిల్స్,ఫిబ్రవరి 19: ఎటు చూసినా పచ్చికబయళ్లు..ఆహ్లాదాన్ని పంచిపెట్టే పరిసరాలు.. రంగురంగుల పూల మొక్కలు. ఏపుగా పెరుగుతున్న మొక్కలు.. ఇవన్నీ కూడా పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలోకి ప్రవేశించిన తర్వాత కనబడే ఆహ్లాద దృశ్యాలు.
గతంలో చెత్తాచెదారం.. నేడు పచ్చదనం..
గతంలో చెత్తాచెదారంతో కూడిన పరిసరాలు.. ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు, మద్యం బాటిళ్లు..కాసేపు సేద తీరాలన్నా వీల్లేని పరిస్థితులు ఉండేవి. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను ఆహ్లాదకరంగా తయారు చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతో కొన్ని రోజులుగా సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన సౌకర్యాల లేమితో అభివృద్ధికి నోచుకోని పంజాగుట్ట శ్మశానవాటికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1, 3 చౌరస్తానుంచి పంజాగుట్ట శ్మశానవాటిక లోపలికి వెళ్లేందుకు రెండేళ్ల క్రితం స్టీల్ బ్రిడ్జి నిర్మించిన సంగతి తెలిసిందే. స్టీల్ బ్రిడ్జిమీదనుంచి శ్మశానవాటికలోకి ప్రవేశించగానే రోడ్డుకు రెండువైపులా పచ్చిక బయళ్లు ఏర్పాటు చేశారు.సమాధుల మధ్యన ఖాళీగా ఉన్న ప్రదేశంలో వివిధ రకాలైన మొక్కలు నాటడంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా పచ్చదనం పెంచడంతో పాటు అందమైన ల్యాండ్ స్కేపింగ్ చేస్తున్నారు.
సుమారు 2వేలకు పైగా పూలమొక్కలు. నీడనిచ్చే మొక్కలతో పాటు సంప్రదాయ మొక్కలైన రావి, మర్రి, జువ్వి, వేప తదితర రకాల మొక్కలు నాటారు. సుమారు రూ.20లక్షల వ్యయంతో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు,. త్వరలోనే పనులు పూర్తిచేయనున్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.1.90 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. దహనవాటికల పునర్నిర్మాణంతో పాటు అంత్యక్రియల కోసం వచ్చే బంధువుల కోసం బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఎంట్రెన్స్ ప్లాజా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేపట్టారు.
త్వరలోనే సుందరీకరణ పనులు పూర్తి
బంధువుల అంత్యక్రియలకు వచ్చేవారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టారు. మా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్ పనుల కోసం రూ 1.90 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. దీనికి తోడు జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో పార్కులో సుమారు 20లక్షల వ్యయంతో పచ్చదనం పెంచేందుకు పనులు చేపట్టాం. పచ్చదనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం మెయింటెనెన్స్ కోసం సరైన చర్యలు తీసుకుంటాం.
విజయ్కుమార్, ఈఈ జీహెచ్ఎంసీ సర్కిల్-18