కరీంనగర్, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈటల రాజేందర్, ఆయన అనుచరుల వేధింపులు భరించలేకనే తాము పార్టీని వీడుతున్నట్టు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్ విమర్శించారు. సుమారు 200 మంది బీజేపీ నాయకులతో కలిసి శనివారం ఆయన మండలంలోని మల్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా బీజేపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన ఎంతోమంది నేతలు ప్రస్తుతం ఈటల, ఆయన అనుచరవర్గం కుట్రలతో పార్టీని వీడాల్సి వస్తుందన్నారు. ఈ పరిణామాలను జిల్లా, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రావట్లేదని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. అనంతరం రవియాదవ్తో పాటు బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తిరుపతియాదవ్, మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్రగౌడ్, ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్ఛా అధ్యక్షుడు జీ పవన్తోపాటు 200 మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.