Pallavi Prashanth | బిగ్బాస్ ఫినాలే సందర్భంగా ఘర్షణలు తలెత్తడానికి పల్లవి ప్రశాంత్ కారణమని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ రోజు రాత్రి జరిగిన విధ్వంసంలో టీఎస్ఆర్టీసీకి చెందిన ఆరు బస్సులు దెబ్బతిన్నాయని, పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. పలువురు పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారు. బిగ్బాస్ ఫినాలే సమయంలో జరిగిన పరిణామాలను హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వివరించారు.
పల్లవి ప్రశాంత్ను బిగ్బాస్ విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా ఏర్పడిందని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ప్రశాంత్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముందే చెప్పామని చెప్పారు. వేరే దారిలో ప్రశాంత్ను పంపించామని తెలిపారు. కానీ పాపులారిటీ కోసం మళ్లీ వచ్చి అక్కడి వారిని రెచ్చగొట్టాడన్నారు. ఎక్కువమంది గుమిగూడి ఘర్షణలు తలెత్తడానికి కారణమయ్యాడని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. తొలి కేసులో పల్లవి ప్రశాంత్ సహా ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు. రెండో కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు చెప్పారు.