సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో రాజ్యాంగ సారాన్ని ప్రతిజ్ఞ రూపంలో మనకందించిన పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవిత చరిత్రను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదింపజేసి, పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. నారాయణగూడలోని జాహ్నవీ డిగ్రీ, పీజీ కాలేజీలో శనివారం ‘ప్రతిజ్ఞ’ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పైడిమర్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల చేత పైడిమర్రి రాసిన ‘ప్రతిజ్ఞ’ చదివించి, ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే విస్తృతంగా తెలంగాణ రచనలు వెలుగులోకి వచ్చి పాఠ్యాంశాలవుతున్నాయన్నారు. తెలంగాణ అవతరించే వరకూ ‘ప్రతిజ్ఞ’ను రాసింది పైడిమర్రి అని లోకానికి తెలియలేదని గుర్తుచేశారు. ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2015లో పాఠ్యపుస్తకాల్లో ‘ప్రతిజ్ఞ’ రచయిత పైడిమర్రి చేర్చడమే కాకుండా, 5, 9వ తరగతి సిలబస్లో పాఠ్యాంశాలు పెట్టారని గుర్తు చేశారు. ప్రజల మధ్య సహోదరభావాన్ని, ఐక్యతను ప్రతిష్ఠించిన పైడిమర్రి గీతరచయిత పేరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త పాశం యాదగిరి, జాహ్నవీ విద్యాసంస్థల చైర్మన్ ఎ.పరమేశ్వర్, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, వాసిరెడ్డి శివానందరావు తదితరులు హాజరయ్యారు.ఉన్నది.