కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆక్సిజన్ కోసం వెయ్యికండ్లతో ఎదురుచూసే వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తున్నది. చివరి సమయంలో శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు అతిపెద్ద ధర్మాస్పత్రి గాంధీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా అదనపు ఆక్సిజన్ కోసం దవాఖాన ప్రాంగణంలో ప్లాంటును ఏర్పాటు చేశారు. ట్రయల్న్ విజయవంతం కావడంతో శుక్రవారం ఉత్పత్తి ప్రారంభమై అందుబాటులోకి వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఇక ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అవుతుందని, ఆక్సిజన్ కొరత శాశ్వతంగా తొలగిపోనుందని చెప్పారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవతో కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు బీడీఎల్ ఇప్పటికే కోటి రూపాయలు మంజూరు చేసింది.
ఎందరికో ప్రాణాలు పోసిన ‘గాంధీ’.. కరోనా బాధితులకు ప్రాణ వాయువునూ అందిస్తున్నది. కొవిడ్ రెండో దశ కరాళనృత్యం చేస్తున్న వేళ రోగులకు ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సరిపడా ఆక్సిజన్ అందించేందుకు గాంధీ ఆస్పత్రి ఆవరణలో సుమారు రూ.2 కోట్ల అంచ నా వ్యయంతో యూనిట్ను నెలకొల్పారు. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 400 రోగులకు సరిపడేలా.. నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ను అందించే రెండు ప్లాంట్లలో శుక్రవారం నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది.
నీటి ఆవిరి, ఆక్సిజన్, నైట్రోజన్, వివిధ రకాల నోబల్ గ్యాస్లను తగిన మోతాదులో కలిపి ప్రత్యేకమైన యంత్ర పరికరాలను వినియోగించి వివిధ దఫాల్లో అవసరమైన ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. తద్వారా ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ తయారవుతుంది. దానిని ట్యాంకులకు అనుసంధానం చేసి ప్రత్యేక పైప్లైన్ ద్వారా ఐసీయూల్లోని వెంటిలేటర్లకు, ఆక్సిజన్ బెడ్లకు సరఫరా చేస్తారు.
ప్రస్తుతం గాంధీ దవాఖానలోని ఐసీయూలలో 500 వెంటిలేటర్ బెడ్లు, 1000 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయ ని, ప్రస్తుతం వాటికి రోజుకు 20వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ అవసరం అవుతున్నదని, దవాఖానలోప్రస్తుతం 20కిలోలీటర్ల ట్యాంక్తో పాటు మరో 6 కిలో లీటర్ల ట్యాంకు ఉన్నదని సూపరింటెండెంట్ రాజారావు తెలిపా రు. గాంధీ మెడికల్ కాలేజీ ఎదురుగా నిర్మించిన లైబ్రరీ భవనం లో ఏర్పాటు చేయనున్న 300 అదనపు బెడ్లకు ఈ యూనిట్ ద్వారా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని చెప్పారు.
గాంధీ దవాఖానలో కరోనా రోగుల కోసం అదనంగా 160 పడకలు సిద్ధం చేసినట్టు సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీతో కలిసి వైద్యశాలను సందర్శించారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను పరిశీలించారు. కరోనా రోగులకు అందిస్తున్న సేవలు, వెంటిలేటర్ల పరిస్థితి, వైద్యశాల నిర్వహణ విధానం, రోగులు చికిత్సా విధానం తదితర అంశాలపై డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావులతో సమీక్షించారు. అనంతరం బయటి రోగుల విభాగం భవనాన్ని పరిశీలించారు. అక్కడ అదనపు బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గాంధీ మెడికల్ కాలేజీ నూతన లైబ్రరీ భవనంలో ఏర్పాటు చేస్తున్న అదనపు బెడ్లను పరిశీలించారు. కొవిడ్ రోగులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్యం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, పురపాలకశాఖ కమిషనర్ సత్యనారాయణ, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.