కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతమవ్వడంతో ఆక్సిజన్ అవసరం రోజు రోజుకూ పెరుగుతున్నది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నది. లిక్విడ్ ఆక్సిజన్ తయారీ, సరఫరా కంపెనీలను ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రాగ్స్ ఎయిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, లిండే ఇండియా లిమిటెడ్ కంపెనీలు జోరుగా ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని వివిధ దవాఖానలకు నిత్యం భారీగా లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరాచేస్తూ కొవిడ్ రోగులకు ప్రాణం పోస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీల నుంచే రాష్ర్టానికి అధిక శాతం ఆక్సిజన్ సరఫరా అవుతుండటం గమనార్హం.
పాశమైలారం ఐడీఏ ఫేజ్-1లోని ఉన్న ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిరోజూ పలు దవాఖానలతోపాటు మరో నాలుగు రీఫిల్లర్లకు 50 నుంచి 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని అపోలో, ప్రైమ్, కేర్, కిమ్స్, యశోదా, పేస్, ఏఐజీ దవాఖానలతోపాటు సంగారెడ్డి జిల్లాలోని కాకతీయ, బీఎంకే, వృద్ధి, కరీంనగర్లోని అపోలో దవాఖానలు ఐనాక్స్ నుంచి ఆక్సిజన్ను పొందుతున్నాయి. అంతేకాకుండా ఐనాక్స్ తన వద్ద ఎప్పుడూ మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉండేలా జాగ్రత్త వహిస్తున్నది.
పాశమైలారం ఫేజ్-3లోని ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆక్సిజన్ను ఉత్పత్తి చేయకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోని తన సొంత కంపెనీలతోపాటు ఒడిశాలోని టాటా-బీఎస్ఎల్ కంపెనీ నుంచి ఆక్సిజన్ నిల్వలను సమకూర్చుకుంటున్నది. డిమాండ్ను బట్టి దవాఖానలు, డీలర్లకు ప్రతిరోజూ 20మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నది. సంగారెడ్డిలోని దవాఖానలతో పాటు హైదరాబాద్లోని ఈఎస్ఐ, అపోలో, తుంబి, రెయిన్బో, ఒవైసీ, ఆర్సీపురం దవాఖానలు, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తదితర సంస్థలు ఈ కంపెనీ నుంచి ఆక్సిజన్ను పొందుతున్నాయి.
ప్రాగ్స్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ప్రతిరోజూ హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోని 28 దవాఖానలు, రీఫిల్లర్లు, డీలర్లకు దాదాపు 95మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని విరించి హెల్త్కేర్, సెంచరీ, సహృదయాలయ, కామినేని, మహావీర్, మెడికవర్, రెయిన్బో, నిఖిల్ తదితర దవాఖానలకు ఆక్సిజన్ను అందజేస్తున్న ప్రాగ్ ఎయిర్ ఇండియా త్వరలో స్థానికంగానే ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది.
గతంలో ఇక్కడే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసిన లిండే ఇండియా లిమిటెడ్.. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఉత్పత్తిని నిలిపివేసింది. అయినప్పటికీ వేరే ప్రాంతాల్లోని తమ పరిశ్రమల నుంచి ఆక్సిజన్ నిల్వలను సమకూర్చుకుని రాష్ట్రంలోని వివిధ దవాఖానలు, డీలర్లకు రోజూ 50 నుంచి 150 మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్, ఈఎస్ఐ, రెయిన్బో తదితర దవాఖానలతోపాటు సంగారెడ్డిలోని దవాఖానలు ఈ కంపెనీ నుంచి ఆక్సిజన్ను పొందుతున్నాయి.
పటాన్చెరు ప్రాంతంలోని రీఫిల్లర్లు సైతం ఆక్సిజన్ పరిశ్రమల నుంచి లిక్విడ్ ఆక్సిజన్ను కొనుగోలుచేసి సిలిండర్ల రూపంలో దవాఖానలకు విక్రయిస్తున్నాయి. పోచారం గ్రామంలోని శ్రీ గణేశ్ ఎంటర్ ప్రైజెస్ 5 నుంచి 10 టన్నులు, పటాన్చెరులోని శ్రీబాలాజీ ఇండస్ట్రీస్ గ్యాసెస్ సంస్థ 5 టన్నులు, తులసి ఆక్సిజన్ సంస్థ 3 నుంచి 5 టన్నులు, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని లక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సంస్థ 5 నుంచి 17 టన్నుల వరకు ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఆక్సిజన్ పరిశ్రమల నుంచి దవాఖానలకు సకాలంలో ప్రాణవాయువు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమల్లో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ పరిశమ్రలను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోని దవాఖాలకు సకాలంలో ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఇద్దరు ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -రాజర్షి షా, అదనపు కలెక్టర్, సంగారెడ్డి జిల్లా