ఉస్మానియా యూనివర్సిటీ, మే 24 : ఉస్మానియా యూనివర్సిటీ ప్రగతి నివేదికను వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 ప్రతిపాదనలు రూపొందించగా, అందులో 80 శాతం పూర్తికాగా.., మిగిలినవి కొనసాగుతున్నాయని చెప్పారు. గతేడాది నూతనంగా 18 కోర్సులను ప్రవేశపెట్టామని, ఈ ఏడాది మరిన్ని కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో యూజీ కోర్సుల పాఠ్యప్రణాళికను సైతం మార్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏ విభాగంలో డిగ్రీ చేసిన వారైనా పీజీ చేసేలా అవకాశం కల్పించామన్నారు. దూరవిద్య విధానంలోనూ నూతన కోర్సులను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. రూసా 2.0లో భాగంగా ఓయూకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.107 కోట్లు కేటాయింగా.., వాటిలో కేవలం రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నాలుగేళ్ల యూజీ కోర్సులను ప్రవేశపెడుతుండడంతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను మూసివేస్తున్నట్లు తెలిపారు. మరో వందేళ్ల పాటు వర్సిటీ కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ అడ్వైజర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ప్రొఫెసర్ గణేశ్, ప్రొఫెసర్ శ్రీరాములు, ప్రొఫెసర్ చింత సాయిలు, ప్రొఫెసర్ భీమా, ప్రొఫెసర్ వీరయ్య, ప్రొఫెసర్ ప్యాట్రిక్, డీన్లు, డైరెక్టర్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.