నవ మాసాలు మోసింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఒక్క రోజుకే వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తీసుకు వచ్చింది. వైద్యులకు చూపించింది. దవాఖానలో అడ్మిట్ చేసింది. బెడ్పై పడుకో బెట్టింది. ఏమైందో తెలియదు కాని.. మళ్లీ వస్తాను నా బిడ్డను చూడండి అంటూ చెప్పి వెళ్లింది.. ఇక తిరిగి రాలేదు. ముక్కుపచ్చలారని ఆ పసికందు మూగ రోదనలు అందరినీ కదిలించినా.. ఆ తల్లి మనస్సు మాత్రం కరుగలేదు. ఇప్పటికీ బిడ్డకోసం తిరిగి రాలేదు. ఈ సంఘటన ఉస్మానియా దవాఖానలో చోటుచేసుకుంది.
మానవత్వం మరిచిన ఓ తల్లి తన ఒక్కరోజు బిడ్డను ఉస్మానియా దవాఖానలో వదిలేసి వెళ్లింది. అఫ్జల్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఉస్మానియా దవాఖానకు ఓ తల్లి బిడ్డను తీసుకువచ్చింది. కాగా వైద్యులు మొదటగా పాపకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్సల కోసం ఏఎంసీ వార్డుకు తరలించారు. ఇదిలా ఉండగా వార్డుకు చేరిన ఆమె బిడ్డను బెడ్పై పడుకోబెట్టి కొద్ది సేపటి అనంతరం పక్కనున్న బెడ్ వారికి బయటికి వెళ్లి వస్తానని చెప్పి పోయింది.
అయితే నిద్రలో నుంచి మేల్కొన్న పాప ఏడవ సాగింది. పసి పాప ఏడుపు అధికం కావడంతో దవాఖాన సిబ్బంది తల్లి కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దవాఖాన పాలకవర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని తల్లి కోసం దర్యాప్తును ప్రారంభించారు. ఇదిలా ఉండగా దవాఖానలో పాపకు వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తున్నారు