సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ)/అబిడ్స్: ఉస్మానియా జనరల్ వైద్యశాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దవాఖానలోని కార్డియాలజీ విభాగానికి రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ వెల్లడించారు. ఈ నిధుల్లో నుంచి కోటి రూపాయల విలువ చేసే 2డీఈకో యంత్రాన్ని టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా సమకూర్చారు. దవాఖానలోని కులీకుతుబ్షా భవనంలోని కార్డియాలజీ విభాగంలో విభాగాధిపతి డాక్టర్ ఇమాముద్దీన్తో కలిసి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ బుధవారం ఈ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.నాగేందర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా అందించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. దవాఖానలోని ఒక్క కార్డియాలజీ విభాగానికే రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో మొదటి విడతగా కోటి రూపాయల విలువైన 2డీఈకో యంత్రాన్ని సమకూర్చగా, త్వరలోనే మరో రూ.7 కోట్ల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, డాక్టర్ కేఎంకే రెడ్డి పాల్గొన్నారు.