సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : ఇంతకాలం అనాథలకు వైద్యం మాత్రమే అందించిన ఉస్మానియా దవాఖాన..తాజాగా వారికి అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరూ లేని రోగులకు మెరుగైన చికిత్సను అందించడంతోపాటు ఆ తర్వాత కూడా వారి జీవన విధానంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. నా అనే వారు లేనివారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును గురువారం సూపరింటెండెంట్ నాగేందర్ ప్రారంభించారు.
ఈ మేరకు ఓపీ బ్లాక్లోని రెండవ అంతస్తులో 10 పడకలతో ఒక వార్డును ఏర్పాటు చేశారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా నర్సింగ్ సిబ్బంది, వైద్య బృందం పని చేస్తుంది. రోగిని పూర్తిగా పరీక్షించిన తర్వాత అవసరమైన వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని సంబంధిత వార్డులకు తరలిస్తారు. రోగి కోలుకున్న తర్వాత తిరిగి ప్రత్యేక వార్డుకు తీసుకువస్తారు. అనాథ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఈ వార్డును హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఇతర వైద్యాధికారులతో కలిసి దవాఖాన సూపరిటెండెంట్ ప్రారంభించారు.
ఈ రోగులకు వ్యక్తిగత సేవలు అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉస్మానియా వైద్యులు ప్రత్యేక సహాయకులను ఏర్పాటు చేశారు. ఈ స్వచ్ఛంద సంస్థ వలంటీర్లు వార్డులో అనాథ రోగి సహాయకులుగా పనిచేస్తారు. దవాఖానలో ఉన్నన్ని రోజులు రోగి బాగోగులు వీరే చూసుకుంటారు. రోగుల బట్టలు శుభ్రం చేయించడం, వారికి స్నానం చేయించడం, ఆహారం అందించడం, సమయానికి మందులు వేసుకునేలా చూడటం, వైద్య పరీక్షల సమయంలో రోగులను వీల్ చైర్లో తీసుకెళ్లడం.. వంటి పనులన్నీ చేస్తారు.
ఎవరూ లేని అనాథలు చికిత్స కోసం ఉస్మానియాను ఆశ్రయించడం కొత్తేమి కాదు. వీరు చికిత్స తీసుకున్న తర్వాత గూడులేక ఎక్కడుంటారో కూడా తెలియదు.. ఎలా బతుకుతున్నారో తెలియదు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది వీరికి సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత.. వీరుడిశ్చార్జి అయ్యి బయటకు వెళ్లిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా అనే వారు లేక.. పట్టించుకునే వారు కనబడక ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఇలాంటి వారికి సహాయం అందించేందుకు ఉ స్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో హాస్పిటల్లో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని సంకల్పించారు. నా అనేవారు లేని రోగులు, పోలీసుల ద్వారా వచ్చే అనాథ రోగులు, అందరూ ఉన్నా..ఎవరూ పట్టించుకోకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అన్ని రకాల సదుపాయాలు, వ్యక్తిగత సహాయక చర్యలు అందించేందుకు ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎవరూ లేని ఒంటరి రోగుల కోసం హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. ఈ వార్డులో రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించడంతో పాటు ఉచితంగా బట్టలు, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తాం. రోగులు పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేయకుండా పోలీసుల సహకారంతో వారిని అనాథాశ్రమాలు లేదా ఇతర సంరక్షణ కేంద్రాలలో చేర్పిస్తాం.- డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన