సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) :ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా ఔటర్ రింగు రోడ్డు వెంబడి సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం పూర్తికావచ్చిందని, త్వరలోనే ప్రారంభించనున్నామని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. శనివారం ఐటీ కారిడార్లోని నానక్రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు నిర్మించిన సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం విశిష్టతను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సీజీఎం రవీందర్తో కలిసి ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఒకేసారి 23 కి.మీ పొడవుతో గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.
సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో కొన్ని చెట్లను తొలగించినట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వాస్తవానికి సైకిల్ ట్రాక్ నిర్మాణంలో తాము నిర్దేశిత ప్రమాణాలు పాటించామని, సోలార్ లైటింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటులో భాగంగా కొన్ని చోట్ల మొక్కలను తాత్కాలిక ప్రాతిపదికన తీసి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పనులు పూర్తయిన తర్వాత వాటిని అదే చోట తిరిగి నాటామని తెలిపారు. అవసరమైన చోట, సందర్భాన్ని బట్టి ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులకు లోబడి హెచ్ఎండీఏ బాధ్యతాయుతంగా పనులు నిర్వహిస్తున్నదని వివరించారు. కొన్ని ఎన్జీఓ సంస్థలు ఉద్దేశ పూర్వకంగా హెచ్ఎండీఏ చేస్తున్న అనేక అభివృద్ధి పనులు, పచ్చదనం పెంపొందించే ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయని, ఇలాంటి వాటిని హెచ్ఎండీఏ ఇకపై తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు.
రద్దీ నేపథ్యంలో సర్వీసు రోడ్ల విస్తరణ
నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ గత 9 ఏండ్లలో శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంలో ఉన్న ఔటర్ రింగు రోడ్డుపైనా, సర్వీసు రోడ్ల మీదుగా గణనీయమైన ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో ప్రభుత్వం సర్వీసు రోడ్ల విస్తరణ పనులు, కొత్తగా ఇంటర్ చేంజ్ల నిర్మాణాలను చేపట్టిందని సీజీఎం రవీందర్ తెలిపారు. ఓఆర్ఆర్ వెంబడి సర్వీసు రోడ్డు 2 వరసలతో ఉంటే దాన్ని 4 వరసలతో విస్తరించి ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా రోడ్లను నిర్మించామని, దీంతో పాటే సైకిల్ ట్రాక్ను సైతం 4.5 మీటర్ల వెడల్పుతో 23 కి.మీ పొడవుతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
సర్వీసు రోడ్ల విస్తరణ సమయంలో సుమారు 5823 మొక్కలను తొలగించాలని నిర్ణయించినప్పుడు వాటిని నిబంధనలకు అనుగుణంగా అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకొని, తొలగించిన చెట్లను తిరిగి వేరే చోట నాటామని చెప్పారు. ఇందులో కొన్ని చెట్లను తెల్లాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లోని హెచ్ఎండీఏకు చెందిన స్థలాల్లోనే నాటామన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ట్రీ పొటెక్షన్ కమిటీల నుంచి ఆర్సీ నం.149/2021/ఎస్బీ5 (18.02.2022), ఆర్సీ నం.49/ఎస్5/ 2022 (12.04.2022) తేదీల్లో అనుమతులు పొందిన తర్వాతే చెట్లను తొలగించి సర్వీసు రోడ్ల విస్తరణ పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం తొలగించిన చెట్ల కంటే ఎక్కువ మొత్తంలోనే మొక్కలను నాటామని, ముఖ్యంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ చుట్టూ మూడు వరసల్లో రకరకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని అన్నారు.