చాదర్ఘాట్, ఆగస్టు 18: ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం పెద్ద మనసుతో ఆలోచించింది. ఆయన చివరి కోరికను నెరవేర్చేందుకు అవయవదానానికి అంగీకరించింది. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు టీఎస్జెన్కో బీటీపీఎస్లో జేపీఏగా పని చేస్తున్న అనిల్కుమార్ (45) ఈ నెల 11న పాల్వంచ దగ్గర ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్థానిక దవాఖానకు తరలించి ఆ పై మెరుగైన వైద్యం కోసం మలక్పేటలోని యశోదకు తీసుకొచ్చారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఇక్కడి వైద్యులు అనిల్ కుమార్కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరు రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. అనిల్ గుండెను గ్రీన్చానల్ ద్వారా చెన్నైలోని ఓ దవాఖానకు, కిడ్నీలను జూబ్లీహిల్స్ అపోలో, యశోద దవాఖాన, లివర్, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ యశోదకు తరలించి రోగులకు అమర్చారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మృతదేహం వద్ద యశోద సిబ్బంది నివాళులర్పించారు.