సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలోని ప్రముఖ దవాఖానల్లో ప్రపంచ అవయవదాన దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఐజీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అవయవ దానానికి, అవయవాల కోసం నిరీక్షిస్తున్న రోగుల సంఖ్యకు చాలా వ్యత్యాసముందన్నారు.
పెరుగుతున్న వ్యాధులతో అవయవాలు విఫలమవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం, అవయవాలు దానం చేసే వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల అవయవ మార్పిడికి నిరీక్షణ తప్పడం లేదని అభిప్రాయపడ్డారు. అవయవ మార్పిడితో పాటు అవి దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవయవ దానం, దాని ప్రాధాన్యతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు. భారతదేశంలో ప్రతి ఏడాది 3.5 లక్షల మందికి అవయవదానం అవసరమవుతుందని, దీనిపై అవగాహన మరింత విస్తృతపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
మధ్య భారతదేశంలోని రోగులకు ప్రపంచ స్థాయి కాలేయ మార్పిడి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దత్తా మేఘ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీమ్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. ప్రపంచ అవయదాన దినోత్సవం సందర్భంగా
అపోలో హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్, దత్తా మేఘ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీమ్డ్ యూనివర్సిటీ సీఈఓ డాక్టర్ సందీప్ శ్రీవాత్సవ్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో కాలేయ మార్పిడి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేసుకున్న ఒప్పందం దేశంలోనే మొదటిదని అన్నారు.
ప్రపంచ అవయదాన దినోత్సవం సందర్భంగా లక్డీకాపూల్లోని గ్లెనిగల్స్ గ్లోబల్ దవాఖానలో అవయమార్పిడి చేసుకొని సంపూర్ణంగా కోలుకున్న వారితో కలిసి ఆస్పత్రి సీనియర్ హెపటాలజిస్ట్ డాక్టర్ చందన్కుమార్, కాలేయ మార్పిడి చికిత్స నిపుణులు డాక్టర్ రాఘవేంద్రబాబుతో కలిసి కేక్ కట్ చేశారు.