అమీర్పేట్, ఆగస్టు 12 : అవయవదానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందని రాష్ట్ర జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత పేర్కొన్నారు. కరోనా సృష్టించిన కష్టకాలం అవయవ దానంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అయితే దాతల్లో పెరుగుతున్న అవగాహనతో క్రమంగా అవయవ దానాలు పెరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ అవయవదాన దినాన్ని పురస్కరించుకుని గురువారం సనత్నగర్లోని రెనోవా ఆసుపత్రిలో అవయవదానంపై రోగులకు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను దాతలు చక్కటి అవగాహనతో దానానికి ముందుకు వస్తున్నారని, అయితే గుండె, ఊపిరితిత్తుల వంటి కీలక అవయవాలను మాత్రం బ్రెయిన్ డెడ్ తరువాత మాత్రమే సేకరించే వీలుందన్నా రు. ఇలా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి సేకరించే అవయవాలు తొమ్మిది మంది ప్రాణాలను కాపాడుతుందనే విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు అవయవ దానాలకు సిద్ధమైన 100 మంది సనత్నగర్ రెనోవా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరిపాలన విభాగం సిబ్బంది ద్వారా సేకరించిన అంగీకార పత్రాలను రెనోవా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాంతి.. జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జి డాక్టర్ జి.స్వర్ణలతకు అందజేశారు. డాక్టర్ స్పందన, తదితరులు పాల్గొన్నారు.