సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ ) : నగర ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నగరవాసుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యాయామం కోసం వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులో భాగంగా నగర వాసులకు శారీరక శ్రమ పెంపొందించేందుకు ఓపెన్ జిమ్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.
ఈ ఓపెన్ జిమ్లతో సహజ వాతావరణంలో వ్యాయాయం చేయడం ద్వారా ముఖ్యంగా సూర్యరశ్మితో విటమిన్ డి పొందడం మూలంగా మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరోటోనిస్ హార్మోన్ ను పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండోర్ కంటే ఔట్డోర్లో చేసే వ్యాయామంతో ఎకువ ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏ మెట్రో నగరంలో లేని ప్లే గ్రౌండ్స్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని, వీటి ద్వారా 45 వేల మంది ప్రయోజనం పొందుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
క్రీడా మైదానాల ద్వారా వ్యాయామంతో పాటు సంప్రదాయ, ఆధునిక క్రీడలను ప్రోత్సహించేందుకు విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. నగర వాసుల కోసం 146 ఓపెన్ జిమ్లను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. అందులో 137 అందుబాటులోకి రాగా మారో 9 వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజల సౌకర్యార్థం కోసం 103 పారుల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.