సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ జూదం.. యువత జీవితాలను ఛిద్రం చేస్తోంది.. జూదంలో కూరుకుపోయి.. యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు జోరు సాగుతున్నాయి. దీనికి సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ కూడా కొందరు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ చాలా మంది యువత తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్ల ఖాతాలకు పంపిస్తున్నారు. అక్రమ పద్ధతిలో నడుస్తున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు. అమాయకులకు వల వేసి భారీగా సంపాదిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు ఈ గేమ్స్ను ప్రమోట్ చేయడానికి ఆన్లైన్ కూడా భారీగానే వెచ్చిస్తున్నారు. రమ్మీ వంటి ఆన్లైన్ బెట్టింగ్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఆ షాక్ నుంచి కోలుకోక, బయట ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడ్డ ఘటనలు రాష్ట్రం వ్యాప్తంగా తరచూ చోటు చేసుకుంటున్నాయి.
జిమ్మిక్కులు చేస్తూ…
ఆన్లైన్ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్సైట్లు ఇంటర్నెట్లో భారీ ప్రకటనలిస్తుంటాయి. దానికి తోడు మా వెబ్సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫరిస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. ఇది వ్యసనంగా మారడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటల నుంచి బయటకు రాని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. ఏ సభ్యుడు రోజు ఎంత సేపు ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ, ఆన్లైన్ సైట్ నిర్వాహకులు వారి దృష్టంతా ఆటపై ఉండేందుకు జిమ్మిక్కులు చేస్తుంటారు.
మొదట రమ్మీ, ఇతర బెట్టింగ్ ఆటలు ఆడిన వారికి గెలిచేందుకు కొంత అవకాశమిస్తారు.. ఆ తరువాత వారికి ఆటను ఆలవాటు చేసి ఇక ఆశలో వారిని ముంచేస్తుంటారు. పది సార్లు పెట్టుబడి బడితే అందులో 8 సార్లు నష్టపోవడం, రెండు సార్లు లాభం వచ్చినట్లు చూపించే లాజిక్స్ను బ్యాకెండ్ నుంచి గ్యాంబ్లింగ్ ఆట నిర్వాహకులు చేస్తుంటారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆటపై గతంలో హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కలర్ ప్రిడిక్షన్ గేమ్ను గతంలో ఉక్కుపాదంతో అణిచివేశారు. ఈ గేమ్లో నష్టపోయిన వారు ఆత్మహత్మలు చేసుకుంటుండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా పోలీసులు స్పందించి మూలాల వరకు వెళ్లి ఆన్లైన్లో జరిగిన స్కామ్ను వెలుగులోకి తెచ్చి దేశ వ్యాప్తంగా నిర్వాహకులను పట్టుకున్నారు.
మార్కెటింగ్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్స్..
పలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారాభివృద్దికి ఇన్ప్లూయెన్సర్స్తో ప్రకటనలు ఇప్పిస్తున్నాయి. సాధారణంగా వ్యాపార ప్రకటనలు ఇస్తే తక్కువ మొత్తంలోనే ఆదాయం ఉంటుంది. అదే నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను మార్కెటింగ్ చేస్తే భారీగా ఆదాయం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలువురు ఇన్ప్లూయెన్సర్స్ ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన లింక్లు తమ సోషల్మీడియా ఖాతా ద్వారా తమ ఫాలోవర్స్కు చేరే విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు. కొందరికీ లక్షల్లో వ్యూవర్స్ ఉంటున్నారు. అందులో కనీసం 10 శాతం మంది అయినా ఆ లింక్ను క్లిక్ చేయడంతో బెట్టింగ్ యాప్లకు భారీగానే ఆదాయం వస్తున్నది. అందులో కొందరు కమీషన్లు తీసుకుంటూ.. మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ ఇతర రాష్ర్టాలు, దేశాల వేదికగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్స్ ఇస్తూ కొందరు సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
సైబర్నేరాలకు తోడు ..
పెట్టుబడి, డిజిటల్ అరెస్ట్, పార్ట్టైమ్ జాబ్స్ ఇలా పలు రకాలైన సైబర్నేరాలు చేస్తున్న ప్రధాన సైబర్నేరగాళ్లు.. బెట్టింగ్ యాప్ల నిర్వాహణలోనూ సూత్రధారులుగా ఉంటున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఈ దిశగా విచారణ జరిపితే గ్యాంబ్లింగ్ గేమ్స్ను నిరోధించేందుకు అవకాశముంటున్నది.