సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : ఉప్పల్ భగాయత్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉప్పల్ మెట్రో రైలు డిపో నుంచి పీర్జాదిగూడ వరకు విస్తరించిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో వివిధ సైజుల్లో ఉన్న మొత్తం 63 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో ప్లాటు 464 గజాల నుంచి 11374 చదరపు గజాల వరకు ఉంటాయని, చదరపు గజానికి నిర్దేశించిన కనీస ధర రూ.35 వేలుగా నిర్ణయించామని అధికారులు తెలిపారు. జూన్ 13న ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్రీ బిడ్ సమావేశం ఉంటుందని, ఒక్కో ప్లాట్లకు ధరావతు వెయ్యి గజాల లోపు ఉంటే రూ.5 లక్షలు, అంతకు మించి ఉన్న ప్లాటుకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ధరావతు చెల్లించేందుకు చివరి తేదీని జూన్ 28 వరకు నిర్ణయించగా, ఆన్లైన్ వేలం జూన్ 30న రెండు దఫాలుగా ఉంటుందని తెలిపారు. ఉదయం 11 నుంచి 2 గంటల వరకు 32 ప్లాట్లు, 3 నుంచి 6 గంటల వరకు మరో 31 ప్లాట్లను విక్రయించాలని షెడ్యూలు ఖరారు చేశారు. వంద శాతం క్లియర్ టైటిల్, సత్వర నిర్మాణానికి అనువైన ప్లాట్లే కాకుండా బహుళ ప్రయోజనంతో కూడిన నిర్మాణాలు చేసుకునే అవకాశం ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ఉందని అధికారులు తెలిపారు. ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు హెచ్ఎండీఏ వెబ్సైట్, ఎంఎస్టీసీఈ కామర్స్, ఎంఎస్టీసీ ఇండియా వెబ్సైట్లలో ప్లాట్ల ఆన్లైన్ వేలానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందన్నారు. స్థల సందర్శనకు, సందేహాల నివృత్తికి 7396345623, 7601063358లలో సంప్రదించాలని తెలిపారు.