హైదరాబాద్: హైదరాబాద్ చైతన్యపురిలోని (Chaitanyapuri) రాజీవ్గాంధీ నగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం కారు అదుపుతప్పి కమాన్ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడిని విశాల్గా గుర్తించామన్నారు. ప్రమాదానికి కారణమైన కారు
చౌటుప్పల్ తహసిల్దార్ హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. ఆయన కుమారుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది వెల్లడించారు. ప్రమాద సమయంలో ఎమ్మార్వో కుమారుడు సాయికార్తీక్ కారును నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.