హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు బోల్తా కొట్టింది. దీంతో కారును నడుపుతున్న దండుగుల తిరుమలేశ్ (30) అనే వ్యక్తి.. అందులో నుంచి రోడ్డుపై పడిపోయారు. తలకు బలంగా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రాహీంపట్నం దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో ఎల్బీనగర్ కామినేని ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.