సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు, సబర్బన్ ప్రాంతాల్లో తిరుగుతున్న దాదాపు 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ బుధవారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14, 15, 16, 17 తేదీలలో లోకల్ రైలు సర్వీసులు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య దాదాపు పది సర్వీసులు రద్దు చేయగా.. లింగంపల్లి-ఫలక్నుమా, ఉందానగర్-లింగంపల్లి, రామచంద్రాపురం-ఫలక్నుమా స్టేషన్ల మధ్య మరో 12 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి, విజయవాడ, గుంటూరు వంటి పలు స్టేషన్ల మధ్య నడువాల్సిన ఆరు రైళ్లను ఈనెల 14, 15 తేదీలలో రద్దు చేసినట్లు బుధవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు వందేభారత్ రైలును రీషెడ్యూల్ చేశారు.
రైల్వేలకు సంబంధించి ఈనెల 15న ఇంటర్నేషనల్ లెవల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు బుధవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మానవ సహిత లెవల్ క్రాసింగ్ల అంశాలపై రైల్వే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎస్సీఆర్ ఆధ్వర్యంలో రోడ్ అండ్ బ్రిడ్జీలు, రైల్వే ఓవర్బ్రిడ్జీల వల్ల దాదాపు 80 లెవల్ క్రాసింగ్లు లేకుండా చేశామన్నారు. భవిష్యత్లో లెవల్ క్రాసింగ్లను దాదాపు లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.