ఎల్బీనగర్, జనవరి 13 : నాగోల్ ఫ్లై ఓవర్ పైనుంచి వెళ్తుండగా చైనా మాంజా దారం తగిలి తండ్రి, కూతురు గాయాలకు గురయ్యారు. ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తండ్రి ముక్కుకు గాయం కాగా.. చిన్నారి మెడకు దారం తగిలి మెడ భాగంలో లోతుగా తెగింది. చిన్నారికి శనివారం ఉదయం శస్త్ర చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్ నివాసి వినయ్కుమార్ సాఫ్ట్వేర్. ఆయన కూతురు కీర్తి ఒకటో తరగతి చదువుతున్నది. శుక్రవారం సాయంత్రం సతీమణిని తీసుకొచ్చేందుకు కమలానగర్ నుంచి వినయ్ కుమార్ తన కూతురు కీర్తిని బైక్పై ముందు కూర్చొబెట్టుకుని ఉప్పల్ మెట్రో స్టేషన్కు బయలుదేరారు.
మార్గమధ్యలో నాగోల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా.. చైనా మాంజా బైక్ నడుపుతున్న వినయ్కుమార్ ముక్కుకు తగిలి కోసుకుపోయింది. దారం నుంచి అతడు తప్పించుకోగా.. ముందుగా కూర్చున్న కూతురు కీర్తికి దారం తగిలి మెడ తెగిపోయి తీవ్ర గాయమైంది. దీంతో బైక్పై ఉన్న తండ్రి, కూతురు కిందపడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం నాగోల్లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కీర్తిని చింతలకుంటలోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కూతురు కీర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, శనివారం ఉదయం ఆమెకు సర్జరీ చేస్తారని తెలిపారు.