ICRISAT | సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ): మానవాళికి సవాలుగా మారుతున్న పౌష్టికాహారం ఉత్పత్తికి ఇక్రిశాట్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. పంటల సాగు, పోషక విలువలు అధికంగా ఉండే ఆహార ధాన్యాల ఉత్పత్తితోనే పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేలా ఇతర సంస్థలతో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా ముంబైకి చెందిన గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ అధ్యయన సంస్థకు ఇక్రిసాట్ టెక్నాలజీ సాయం చేయనుంది. పౌష్టికాహార ఉత్పత్తిలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ, సాగు విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. ఈ భాగస్వామ్య పరిశోధనల ద్వారా త్వరితగతిన పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహార ఉత్పత్తులపై జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడంలో భాగంగా స్మార్ట్ ప్రొటీన్ కార్యక్రమాన్ని గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఇక్రిసాట్తోపాటు దేశంలోని వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన పరిశోధన సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఇప్పటికే నేల స్వరూపం, పంట రకాల ఆధారంగా ఇక్రిసాట్ ప్రత్యేక సాగు విధానాలను అమలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా ప్రొటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తుల సాగుకు సమగ్ర విధానాల రూపకల్పన సులభతరం అవుతుందని భావిస్తున్నారు.