NRI UK : బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే విభాగం ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. బంజారా బిడ్డ తరుణ్ లూనావత్ ప్రసంగిస్తూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతి కోసం చేసిన కృషి, పోరాటాలు, సామాజిక చైతన్యానికి చేసిన సేవలను వివరించారు. సమాజంలో సమానత్వం, ధార్మికత, సేవాభావం వంటి విలువలను ఆయన బోధించిన తీరు నేటి తరానికి ఆదర్శప్రాయమని తరుణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన బీఆర్ఎస్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే అధ్యక్షులు ప్రసంగిస్తూ, గౌరవనీయులైన చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గాన్నీ సమానంగా చూడటం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా బంజారా సమాజానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 278 వ జయంతిని నిర్వహించడం గర్వకారణమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి కుమార్ రేటినేని, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, ముఖ్య సభ్యులు అబ్దుల్ ఖుదూస్, ఇమ్రాన్, హరీష రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుక బంజారా సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.