సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): సాధారణ ప్రసవాలను మరింతగా పెంచేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని చార్మినార్ డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ అన్నారు. బస్తీ దవాఖాన వైద్యులతో ఆమె గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. టెలి మెడిసిన్ సేవలు రోజుకు ఐదుగురి చొప్పున అందజేయాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలిన వారికి మందులు అందజేయాలని, ఎప్పటికప్పుడు మందులు సరిపడా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పారు. ఆరోగ్య మహిళ కేసులు ఉంటే దగ్గరలోని యూపీహెచ్సీలకు రెఫర్ చేయాలన్నారు.
చార్మినార్ జోన్లో ఉన్న అన్ని యూపీహెచ్సీల్లో 70 శాతం సాధారణ ప్రసవాలు నమోదు అయ్యేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆశాలు ఇంటింటి సర్వేలో జ్వర పీడితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలని సూచించారు. ఇందుకు జోన్ ప్రాంతంలోని మెడికల్ ఆఫీసర్లు 100 శాతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సునంద డాక్టర్ బ్రిడ్జిస్, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సీహెచ్వో రఫిక్ తదితరులు పాల్గొన్నారు.