సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయడంపై ఆ యూనివర్సిటీ అధికారులు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 430 వరకు ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల ద్వారా బీఎ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా అఫిలియేషన్ దరఖాస్తులు, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టం (యూఎంఎస్) ద్వారా అఫిలియేషన్ డాక్యుమెంట్ల పరిశీలన వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు.. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల సమస్య పరిష్కారాలపైనా దృష్టి సారించారు. ఈ అంశంపైనా సంబంధిత అధికారులతో ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ కూడా తరచూ చర్చలు జరుపుతున్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు.
ఓయూ పరిధిలో చాలా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో పాఠాలు బోధించే అధ్యాపకులు ఒకటి కంటే ఎక్కువ కాలేజీలలో పని చేస్తున్నట్లు సమాచారం. తమ కాలేజీల్లో కొన్ని రకాల కోర్సులల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు తక్కువ జీతాలతో పని చేసే అధ్యాపకులతో యాజమాన్యాలు పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో వారంతా ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో అధ్యాపకులుగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీని వల్ల డిగ్రీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠాలు బోధించే అవకాశం లేదు.
దీంతో బోధన విధానంలో అనేక రకాల సమస్యలు తలెత్తడంతో పాటు విద్యార్థులకు అభ్యాసన సామర్థ్యాలు బాగా తగ్గుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం విద్యార్థులకు నాణ్యమైన విద్యా విధానం అందుబాటుకోకి రావడం గగన కుసుమంగా భావిస్తున్నారు. అందుకోసమే.. డ్యూయల్ ఫ్యాకల్టీ విధానాన్ని నియంత్రించడం పట్ల ఓయూ అధికారులు దృష్టి సారించాచ. కొన్ని కాలేజీల్లో డ్యుయల్ అధ్యాపకుల విధానం, విద్యార్హతలు వంటి వాటితో పాటు ప్రిన్సిపాళ్ల రాటిఫికేషన్ సమస్య కూడా ఉందని, దీనిపై వీలైనంత త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఓయూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో యాజమాన్యాలు కూడా సహకరించాలంటున్నారు.
దోస్త్ అడ్మిషన్ల నాటికి కొన్ని కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తి..
డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్-2023 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దోస్త్లో తొలి విడుత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం నాటికి మిగిలిన కొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు కూడా అఫిలియేషన్లు పూర్తి చేయాలన్న సంకల్పంచారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంత ఆలస్యమవుతున్నది. ఈ అంశంపై ఓయూ అకాడమిక్ ఆడిట్ సెల్ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే తొలి విడుత వెబ్ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 20 నుంచి జూన్ 11 వరకు కొనసాగనుంది. ఆ లోపే విద్యా ప్రమాణాలు పాటించిన అన్ని కాలేజీలకు అఫిలియేషన్లు జారీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుతున్నారు.