హైదరాబాద్ : ప్రవాసుల సంఘర్షణలను, అస్తిత్వవేదనను ఆంగ్లంలో అద్భుతంగా కథలుగా మలిచిన నిశాంత్ రచనలు తెలంగాణకు గర్వకారణమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ (Chairman Juluri Gourishankar) అన్నారు. శనివారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిశాంత్ ఇంజమ్ (Nishant Injam) రాసిన ది బెస్ట్ పాజిబుల్ ఎక్స్పిరియన్స్ (The Best Possible Experience) కథల సంపుటిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దేశాల సంస్కృతి (Culture ) , సామాజిక సంబంధాల మధ్య జరిగే ఘర్షణను రచయిత నిశాంత్ ఇంజమ్ శక్తివంతమైన కథలుగా మలిచారని పేర్కొన్నారు. నిశాంత్ కథల సంపుటి ద్వారా తెలంగాణ ప్రాంతం చైతన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న నిశాంత్ తెలంగాణ నేలతో తన అనుబంధాన్ని, అనుభూతులను , ప్రవాస జీవన అనుభవాలను ఆంగ్లంలో కథలుగా రాశాని తెలిపారు.
ఈ కథల సంపుటిని అమెరికా (America) లోని ప్రఖ్యాత ప్రచురణా సంస్థ ముద్రించిందని అన్నారు. భవిష్యత్లో మన దేశానికి పేరు తెచ్చే ప్రఖ్యాత రచయితగా ఎదుగుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈ పుస్తకంపై పలువురు సాహితీవేత్తలు ముఖాముఖి చర్చ జరిపారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, రచయిత నిషాంత్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నర్సింహారావు, సామాజిక విశ్వేషకులు ఐ.వి రమణరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ బుక్ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.