ప్రాణాంతక క్యాన్సర్ సోకిందంటే అంతా ఇంతా భయం కాదు. ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తూ ప్రాణాలను హరిస్తుంది. అయితే వైద్యరంగంలో ప్రధానంగా క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వ్యాధి తీవ్రత తగ్గి ఆయుష్షు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానల్లో రూ.10 లక్షలు ఖర్చయ్యే స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ ఆధునిక చికిత్సను నిమ్స్లో ఉచితంగా చేస్తూ రోగికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. నాలుగేండ్ల క్రితం దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో దవాఖానలో స్టెమ్సెల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక టెక్నాలజీతో ఈ విభాగాన్ని తీర్చిదిద్దారు. ఈ చికిత్సకు నెలరోజులు పడుతుందని, ఆగస్టు మాసంలో ఏడుగురికి స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించామని నిమ్స్ దవాఖాన ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు వెల్లడించారు. భవిష్యత్లో ఈ విధానమే కీలకమని, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ద్వారా చికిత్స పూర్తిగా ఉచితమని ఆయన చెప్పారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 5: క్యాన్సర్.. ఇది కనిపించకుండానే మనిషిని కబళించే ప్రాణాంతక వ్యాధి.. ఆరోగ్యవంతమైన కణాలను రోగగ్రస్తం చేసి ప్రాణాలను హరిస్తుంది. పూర్వం క్యాన్సర్ వచ్చిందంటే ఆశలు వదిలేసుకునేవారు. కానీ ప్రస్తుతం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఆధునిక వైద్య విధానానికి తార్కాణంగా నిలుస్తున్న స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చికిత్స ద్వారా క్యాన్సర్ రోగులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. ఎంతో ఖరీదైన ఈ వైద్యాన్ని నిమ్స్ వైద్యశాలలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు.
స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలో ఆటోలోగస్, ఆలోజెనిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆటోలోగస్లో బ్లడ్క్యాన్సర్ రోగికి సంబంధించిన స్టెమ్సెల్స్ను ముందుగా తీసుకొని భద్రపరుస్తారు. తర్వాత హైడోస్ కీమోథెరపి లాంటి చికిత్స అందించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన కణాలు సైతం దెబ్బతింటాయి. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆరోగ్యవంతమైన స్టెమ్సెల్స్ను రోగిలోకి తిరిగి ప్రవేశపెడుతారు. ఆలోజెనిక్ విధానంలో రోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకుల స్టెమ్సెల్స్ను స్వీకరిస్తారు. వాటిని హ్యుమన్ ల్యూకోసైట్ అంటిజెన్ (హెచ్ఎల్ఏ) టైపింగ్ పరీక్ష ద్వారా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది పరిశీలిస్తారు.
స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియకు వారం నుంచి పది రోజులు పడుతుంది. తర్వాత మొత్తం చికిత్స సుమారు రెండు నుంచి మూడు వారాల పాటు కొనసాగుతుంది. ఈ చికిత్స తీసుకున్న వారు అందరిలా జీవితాన్ని గడపొచ్చు. ఏడుగురి ప్రాణాలు నిలిపి..
వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతూ ఆగస్టులో నిమ్స్లో చేరిన ఏడుగురికి వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. అందులో ఐదుగురు మైలోమా, ఒకరు లింపోమా, మరొకరు అప్లాస్టిక్ అనేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి ఆరోగ్యశ్రీ, ఒకరికి ఈహెచ్ఎస్, మరొకరికి నామమాత్రంగా చార్జ్ చేసి చికిత్స అందించారు. దేశంలోని ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో ఈ చికిత్స విధానానికి కనీసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
నాలుగు సంవత్సరాల క్రితం నిమ్స్ దవాఖానలో రూ.25 కోట్లతో స్టెమ్సెల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏ-స్టెమ్ సెల్ రీసెర్చ్, బీ-స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, సీ-ఐసీయూ, డి-డయాగ్నస్టిక్ విభాగాలుగా విభజించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక పరికరాలను తెప్పించారు. ఇందులోని ఎనిమిది గదుల్లో కనీసం ఒక్క మట్టి రేణువు కూడా లోనికి వెళ్లకుండా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఈ గదుల్లో ఏర్పాటు చేసిన హెపా ఫిల్టర్స్ గాలిని నిరంతరం శుద్ధి చేస్తాయి. రోగులకు వేర్వేరుగా హైజినిక్ బాత్ర్రూంలతో పాటు సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేశారు.
మాది ఖమ్మం చింతకాని మండలం బొప్పారం గ్రామం. గతేడాది డిసెంబర్లో మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా నిమ్స్కు తీసుకొచ్చాం. పరీక్షలో మల్టిపుల్ మైలోమాగా గుర్తించారు. అప్పటి నుంచి కీమోథెరపీ చేయిస్తున్నాం. ప్రతి నెల వైద్యం కోసం ఇక్కడికి తీసుకు వచ్చేవాళ్లం. గత నెల 28న అరోగ్య శ్రీ ద్వారా మా అమ్మకు స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నది. రక్త కణాలు కూడా తగ్గడం లేదని వైద్యులు చెప్పడం సంతోషంగా ఉంది. -వడ్లానపు మాధవరావు
క్యాన్సర్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనేక నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి. ఈ ఆధునిక చికిత్సా విధానంలో క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆగస్టు నెలలో ఏడుగురికి స్టెమ్ సెల్ చికిత్స చేసి కొత్త జీవితాన్ని అందించాం. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్స్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం. నిమ్స్లో స్టెమ్సెల్స్ను భద్రపరిచేందుకు ఆధునిక ల్యాబ్ సైతం రూపు దిద్దుకుంటున్నది. త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ జి. సదాశివుడు, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి, నిమ్స్