సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): బట్టల వ్యాపారం కోసం భారత్కు వచ్చి, సైబర్ నేరాలతో అమాయక ప్రజలను మోసగించడమే కాకుండా పెండ్లి పేరుతో ఓ యువతికి రూ.27.43లక్షల టోకరా వేసి, తప్పించుకు తిరుగుతున్న నైజీరియన్ను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, మార్కెట్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దీంతో నగరంలోని ట్రై కమిషనరేట్లతోపాటు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పాల్పడిన మొత్తం 12 కేసులను పోలీసులు ఛేదించారు. శనివారం టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్జోన్ డీసీపీ చందనా దీప్తి, టాస్క్ఫోర్స్ డీసీపీ(ఒఎస్డి) రాధాకిష్ణారావులతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
నైజీరియా దేశానికి చెందిన అలెగ్జ్ మార్క్ ఒడుడు(44) బట్టల వ్యాపారం చేసేందుకు తన స్నేహితుల సహకారంతో 20 ఏండ్ల కిందట భారత్కు వచ్చి, ముంబైలో స్థిరపడ్డాడు. తరచూ ముంబై, నైజీరియాకు రాకపోకలు సాగిస్తున్న అలెగ్జ్కు సైబర్ నేరాలకు పాల్పడుతున్న అతడి స్నేహితుల తీరుకు ఆకర్శితుడయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు తొలిసారిగా 2022లో ఆయుర్వేదిక్ ఆయిల్ పేరుతో సైబర్ నేరానికి పాల్పడి, మహారాష్ట్ర పోలీసులకు పట్టుపడ్డాడు. ఈ క్రమంలో 7నెలలు జైలు శిక్ష అనుభవించిన నిందితుడు 2023, జూలైలో తన స్నేహితుల సహకారంతో వివాహం కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసగించి, డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. తన పేరు ఆదిల్జవేష్ అని, యూఎస్లోని హాస్టన్లో నివాసముంటున్నానని, తాను ఎన్ఆర్ఐ అని, కార్డియో థొరాసిక్ సర్జన్గా బ్రుక్ ఆర్మి మెడికల్ కాలేజిలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.
ఈ విధంగా మాటలు కలిపి దగ్గరైన నిందితుడు తాను సిరాయ వెళ్తున్నట్లు చెప్పాడు. ఓ రోజు యువతికి వాట్సాప్ కాల్ చేసి, తాను ఉంటున్న సిరాయ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు జరిపారు, తాను అక్కడ ఉండలేనని, నా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని, తాను ఇండియాకు తిరిగి వచ్చి, వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. నిందితుడి మాటలు నమ్మిన ఆ యువతి దఫదఫాలుగా నిందితుడికి రూ.27.43లక్షలు పంపింది. గత నెల 7న సికింద్రాబాద్, ఘాంస్ మండిలోని యువతి ఇంటికి వచ్చిన నిందితుడు నకిలీ కరెన్సీ బండిల్స్తో కూడిన డిజిటల్ లాకర్ను అందజేసి, మరోసారి మోసగించాడు. దీంతో తేరుకున్న బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.