ఉప్పల్, అక్టోబర్ 11: ఎన్జీఆర్ఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశం సోమవారం వర్చువల్ మోడ్లో నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శేఖర్ సీ. మండే హాజరయ్యారు. ఈ మేరకు ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక సంచిక, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. అనంతరం, వారు మాట్లాడుతూ భూగర్భ జలాలు, ప్రమాదాల నిర్వాహణ, తదితర సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ఎన్జీఆర్ఐ కృషి అభినందనీయమన్నారు. శాస్త్రీయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సంస్థకు గుర్తింపు రావడం సంతోషకరంగా ఉందన్నారు. నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తల కృషి, అంకితభావంతో ముందుకు తీసుకువెళ్లడంతో సంస్థ ఉన్నత స్థాయికి చేరుకుందన్నారు. 60 యేళ్ల కాలంలో ఐదువేలకు పైగా పరిశోధన వ్యాసాలు, 100 పుస్తకాలు ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. సామాజిక అవసరాలకు ఎన్జీఆర్ఐ ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం తివారి, డైమండ్ జూబ్లీ ఉత్సవాల కమిటీ చైర్మన్, సీనియర్ సైంటిస్టు డాక్టర్ ఎన్.పూర్ణచందర్ రావు, శ్రీనివాస్, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్, కీర్తి శ్రీవాస్తవ పాల్గొన్నారు.