త్వరలో సరికొత్త సొబగుల్లో ట్యాంక్బండ్
అత్యంత ఆకర్షణీయంగా మారనున్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్
ఇంటిగ్రేటెడ్ మాస్టర్ రూపకల్పనకు ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్లతో డిజైన్లు
రూ. 5 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న హుస్సేన్సాగర్ మరిన్ని అందాలను అద్దుకోనున్నది. నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్బండ్, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇప్పటికే వారాంతాల్లో 2.20 లక్షలకు పైగా సందర్శిస్తున్నారు. మొత్తం వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో సంజీవయ్యపార్కు, జలవిహార్, పీవీ ఘాట్, థ్రిల్సిటీ, నైట్ బజార్ లాంటి ఎన్నో చూడచక్కని అందాలు ఉండగా వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ను కలుపుతూ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్లతో డిజైన్లు రూపొందించి, అత్యుత్తమైన వాటిని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు టెండర్లను పిలిచిన అధికారులు ఈ నెల 30 లోగా స్వీకరించనున్నారు.
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సాగర తీరం సరికొత్త సొబగులతో ముస్తాబవుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీర ప్రాంతమంతా పర్యాటకానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. చుట్టూ ఉన్న వివిధ పార్కులకు కేవలం ఆదివారాల్లోనే 2.20లక్షలకుపైగా సందర్శకులు వస్తున్నారు. అలాంటి సాగర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేస్తోంది. ట్యాంక్ బండ్తో ప్రారంభమైన సుందరీకరణ, చుట్టూ ఉన్న పార్కులు, ప్రదేశాలను కలుపుతూ సరికొత్త థీమ్లను ఆట విడుపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇందులో భాగంగానే హెచ్ఎండీఏ అధికారులు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లను కలుపుతూ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా హుస్సేన్సాగర్ చుట్టూ రకరకాల ఆట విడుపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.5 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్లతో డిజైన్లు రూపొందించి, అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను హెచ్ఎండీఏ పిలిచింది. ఈ నెల 30వ తేదీలోగా టెండర్లను స్వీకరించి, ఆ తర్వాత ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్లను ఎంపిక చేసి డిజైన్లు రూపొందించే బాధ్యతలను అప్పగించనుంది.