వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 15: దేశంలో ఆహార భద్రతకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీ అవసరమని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉప కులపతి డా. రఘునందన్రావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రి వర్సిటీ ఆడిటోరియంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం – ఆవిష్కరణ, సుస్థిరత.. అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు ఆహార భద్రత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలన్నారు. అప్పుడే భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించ గలమన్నారు. సాగులో తెలంగాణ రాష్ట్రం మంచి ఫలితాలు సాధించిందంటే, అందుకు స్థానిక ప్రభుత్వ సహకారం ఎంతో ఉన్నదని గుర్తు చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై విద్యార్థుల ఆసక్తి పెరిగిందన్నారు. తెలంగాణలో ఈ రంగంలో ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి రంగాలు అధిక మయ్యాయని తెలిపారు.
దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించాల్సి అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు, వాటి ఫలితాలు దేశ రైతులకు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ చంద్ర దూబే అన్నారు. ఈ సదస్సులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ఆర్. శారదా జయలక్ష్మీ దేవి, ప్లాంట్ ప్రాటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీపీఏఐ) చైర్మన్ శరత్బాబు, ధనూక అగ్రిటెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చైర్మన్ ఆర్.జి.అగర్వాల్, బయోటెక్ ఈస్థటిక్ సీఈఓ డా. కెఆర్కె. రెడ్డి, పీజేటీఎస్ఏయూ మాజీ ఉప కులపతి డా. ప్రవీణ్రావు, జగదీశ్వర్, కేఏ సింగ్, తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రోత్సహించడం, సస్యరక్షణ సంబంధిత పరిశోధనా రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, మొక్కల సంరక్షణ, ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేశారు. ప్లాంట్ ప్రాటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీపీఏఐ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో దేశంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ విద్యార్థులు పాల్గొన్నారు.