Hyderabad | హైదరాబాద్ : 35 ఏండ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ను పునర్ వ్యవస్థీకరించినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పోలీసు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా మేరకు కొత్త పీఎస్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 35 ఏండ్ల కింద కమిషనరేట్ పరిధిలో 25 లక్షల జనాభా ఉండేది. ఇప్పుడు నగర జనాభా 85 లక్షలకు పెరిగిందన్నారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారని సీపీ గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పీఎస్లు, 13 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో పాటు 5 కొత్త ఉమెన్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సచివాలయం కోసం కొత్త పీఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సెక్రటేరియట్ పీఎస్ను బీఆర్కే భవన్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్ పీఎస్కు స్పెషల్గా ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కోసం ఒక డీసీపీతో పాటు 148 మంది పోలీసులను కేటాయించినట్లు తెలిపారు.