సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): “మీరు షాపింగ్ చేశారు…అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది..మా ఆన్లైన్ షాపింగ్ యాప్లో మీరు కొనుగోలు చేసినందుకు మీకు భారీ బహుమతి వరించింది…” అంటూ ఓ ఫోన్ కాల్.“మా కంపెనీలో షాపింగ్ చేసిన వినియోగదారుల ఫోన్ నెంబర్లలో లక్కీ డ్రా తీశాం. అందులో మీరు ఖరీదైన కారు గెల్చుకున్నారు.ఆ కారును డెలివరీ చేద్దామని మీకు ఫోన్ చేశాం. మీరు కారు తీసుకుంటారా..లేదా నగదును తీసుకుంటారా..” అంటూ మరో ఫోన్ కాల్.
ఇలా సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బహుమతులు అంటూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, షాపింగ్ క్లూస్ పేర్లను వాడిన నేరగాళ్లు ఇప్పుడు మీషో ఆన్లైన్ షాపింగ్ యాప్ పేరునూ వాడుతున్నారు. ఇన్ని రోజులు ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్సైట్ల పేర్లను చెప్పుకోగా… అలా చెబితే ఎవరూ నమ్మడం లేదని మహిళలు ఎక్కువగా ఉపయోగించే మీషో బ్రాండ్ను ఉపయోగిస్తున్నారని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా మహిళలకు సంబంధించిన వస్తువులు ఉండడంతో వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. రెండు రోజులుగా రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ మహిళ, క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. వారు దాదాపు రూ. 2 లక్షలకుపైగా పోగొట్టుకున్నారు. వారికి భారీ బహుమతులు వచ్చాయని, గిఫ్ట్లు వద్దంటే నగదు ఇస్తామని చెప్పి చార్జీల పేరుతో వారి నుంచి ఈ నగదును తీసుకుని మోసం చేసినట్లు బాధితులు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ షాపింగ్లో ఖరీదైన బహుమతి పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, వాట్సాప్ కాల్ చేసినా వాటిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్యూఆర్ స్కాన్ చేశాడంతే… ఖాతాలో డబ్బులన్నీ మాయం!
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : పాత సోఫా విక్రయించేందుకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన ఓ ఆర్కిటెక్కు సైబర్ నేరగాళ్లు రూ. 6లక్షలు టోకరా వేశారు. శేరిలింగంపల్లికి చెందిన ఓ అర్కిటెక్ తన ఇంట్లోని మూడు కుర్చీల సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు. దాని ధర రూ.7 వేలు పెట్టగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనకు హైదరాబాద్లో పాత సోఫా రిపేర్ చేసే షాపు ఉంది. మీ సోఫా కొనుగొలు చేస్తానని చెప్పాడు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో వెంటనే మీకు డబ్బు పంపిస్తాను అని చెప్పి క్యూఆర్ కోడ్ పంపాడు. అలా స్కానింగ్ను ప్రారంభించిన గుర్తు తెలియని వ్యక్తి పేటీఎమ్ ఖాతాలో ఉన్న నగదంతా ఊడ్చేశాడు. అయినా గుర్తు పట్టని ఆర్కిటెక్ తనకు డబ్బులు రాలేదని చెప్పగా, వాట్సాప్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి మరో రెండు ఖాతాలను తీసుకున్నాడు. వాటికి పంపిస్తానని చెప్పి అందులో ఉన్న నగదును కూడా కొట్టేశాడు. చివరకు ఇది మోసమని గ్రహించే సరికి ఆర్కిటెక్ ఖాతాలో రూ. 6 లక్షలు డెబిట్ అయ్యినట్లు మెసేజ్లు వచ్చాయి. వెంటనే తేరుకున్న ఆర్కిటెక్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓటీపీ చెప్పి.. మోసపోయి..
ఖైరతాబాద్, మే 18 : మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎవరికీ చెప్పొద్దన్న విషయం మర్చిపోయి… ఆ వివరాలు చెప్పేసి రూ. 89వేలు పోగొట్టుకున్నది ఓ మహిళ. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమీర్పేట బీకే గూడకు చెందిన ఓ మహిళ (34) ఓ ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ కార్యాలయంలో సీనియర్ మేనేజర్గా పని చేస్తున్నది. మద్యం కోసం ఆమె అమీర్పేటకు చెందిన ఎస్ఎస్ లిక్కర్ మాల్కు ఫోన్ చేశారు. ల్యాండ్లైన్ పని చేయకపోవడంతో సెల్ఫోన్ నంబరుకు కాల్ చేయగా, రోహిత్ అనే వ్యక్తి లైన్లోకి వచ్చాడు. షాపు మూసి ఉందని, బిజినెస్ కార్డు వివరాలు పంపించాలని కోరాడు. వివరాలు ఇవ్వగానే ఓటీపీ అడిగాడు. అలా మూడు సార్లు ఓటీపీ పంపించి ఆ వివరాలు తెలుసుకున్నాడు. కొద్దిసేపటికి ఆమె ఖాతా నుంచి మొత్తం రూ.89,543 డబ్బులు డ్రా అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.