మియాపూర్, జూలై 7: ఐటీకి కేంద్రమైన వెస్ట్జోన్ శేరిలింగంపల్లిలో పచ్చదనంపై అధికారులు ప్రత్యేక దృష్టిని నిలిపారు. పచ్చదనం నిర్వహణలో గతంలో అవార్డులు అందుకున్న నేపథ్యంలో ఆ ప్రత్యేకతను కొనసాగించేలా.. ప్రజలకు ఆహ్లాదాన్నందించేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పదుల ఎకరాలలో ఉన్న భారీ పార్కులు, థీమ్ పార్కులు, కాలనీ పార్కులు ప్రజలకు అందుబాటులో ఉండగగా.. వాటి సంఖ్యను మరింత పెంచే కసరత్తులు చేస్తున్నారు. బల్దియా బయోడైవర్సిటీ విభాగం అధికారుల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పార్కులుగా గుర్తించబడి.. ఆ ఆనవాళ్లు లేకుండా పోయిన వాటిపై తాజాగా ప్రత్యేక దృష్టిని పెట్టారు. అలాంటి వాటన్నింటికి పూర్వ వైభవం తీసుకురావాలన్న అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి జోన్ బయోడైవర్సిటీ విభాగం వాటి సంస్కరణకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లకు గాను 150 ప్రాంతాలలో అదనంగా పార్కులను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించారు. తద్వారా అనతికాలంలోనే వాటిని పూర్తి స్థాయిలో పార్కులుగా మలిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
గుర్తించినవి..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పార్కులుగా రికార్డులలో ఉండి ఏ మాత్రం ఆనవాళ్లులేని వాటిని అధికారుల నాలుగు రకాలుగా విభజించారు. ఇందులో నాలుగు సర్కిళ్లలో కలిపి 70 ట్రీ పార్కులు, 15 అబాండన్(ఏమాత్రం పార్కుగా రూపం లేని) పార్కులు, 67 ఓపెన్ స్పేస్ పార్కులు, కాలనీ సంక్షేమ సంఘాల నియంత్రణలో 57 పార్కులున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి అవి పేరుకే పార్కులుగా ఏమాత్రం కనీస వసతులు లేక వినియోగంలో లేనట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి.. కనీస వసతులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బల్దియా బయోడైవర్సిటీ ఉన్నతాధికారులు ఇక్కడి వెస్ట్జోన్ బయో డైవర్సిటీ విభాగం అధికారులను ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటిని బాగు చేసే చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 13 పార్కులను ఇప్పటికే వసతులతో తీర్చిదిద్ది వినియోగంలోకి తీసుకువచ్చారు. మిగిలిన వాటినీ యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే వీటిని బాగు చేసేందుకు కొంత మేర నిధులు అవసరమైన నేపథ్యంలో.. వాటి మంజూరు కోసం ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జోన్ వ్యాప్తంగా నాలుగు సర్కిళ్లలో కలిపి 500 లకు పైగా కాలనీ పార్కులుండగా.. అదనంగా ఇవి కూడా తోడైతే ప్రజలకు మరింత పచ్చదనం, ఆహ్లాదం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా గత జూన్ మాసంలో జోన్ వ్యాప్తంగా 10 దశాబ్ది పార్కులను సైతం అందుబాటులోకి తెచ్చారు.
వెస్ట్జోన్ శేరిలింగంపల్లిలో పచ్చదనం పెంపుకు మా విభాగం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే భిన్నమైన థీమ్ పార్కులను సిద్ధం చేస్తున్నాం. కాలనీ సంక్షేమ సంఘాల పార్కులు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వీటికి అదనంగా జోన్ వ్యాప్తంగా 150 వరకు పార్కులుగా గుర్తింపు ఉన్నప్పటికీ వసతులులేక వినియోగంలో లేవు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని పూర్తి స్థాయిలో సుందరీకరించి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. వీటిలో ఇప్పటికే ఆయా సర్కిళ్ల పరిధిలో 13 పార్కులను సుందరీకరించి వినియోగంలోకి తీసుకువచ్చాం. గత నెలలో 10 దశాబ్ది పార్కులను సైతం జోన్ వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం.
– అనీల్కుమార్, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్, శేరిలింగంపల్లి జోన్