ప్రకృతి అందాలకు నెలవైన హుస్సేన్సాగర్ తీరం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. పర్యాటకులు మరింత తన్మయత్వం పొందేలా సుందరీకరణ చేపట్టిన హెచ్ఎండీఏ… నెక్లెస్ రోడ్లో వివిధ నిర్మాణాలను చేపట్టింది. అందులో ముఖ్యమైంది రూ. 7 కోట్లతో ఏడు ఎకరాల్లో నిర్మిస్తున్న లేక్ ఫ్రంట్ పార్కు. దీనికి ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ కిశోర్ ప్రధాన్ డిజైన్లు అందించగా, ‘నభూతో న భవిష్యత్’ అనేలా ఈ ఉద్యానవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోభాగంగా ఏర్పాటు చేస్తున్న స్ట్రక్చరల్పై నడుచుకుంటూ.. నీళ్ల మధ్యకు వెళ్లి.. సాగర్ అందాలను చూడటం కొత్త అనుభూతినిస్తుందని అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో,జూన్ 7 (నమస్తే తెలంగాణ): పచ్చని అందాలకు నిలయమైన సాగరతీరం మరిన్ని సొబగులద్దుకుంటున్నది. ఇప్పటికే సాగర్ పరిసరాల్లో చూడ చక్కని ఆకృతులతో ఉద్యానవనాలను నిర్మిస్తున్న హెచ్ఎండీఏ.. నగరవాసులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమైంది. సంజీవయ్య పార్కు నుంచి ఖైరతాబాద్ వైపు నెక్లెస్ రోడ్డు మార్గంలోని వీవీ ఘాట్ నుంచి, జలవిహార్ వరకు సరికొత్త అందాలను పరిచయం చేయనున్నది. ముఖ్యంగా ఏడు ఎకరాల్లో నిర్మిస్తున్న లేక్ ఫ్రంట్ పార్కు పర్యాటకులకు మధురానుభూతిని ఇవ్వడం ఖాయమంటున్నారు అధికారులు.
హుస్సేన్ సాగర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరీకరణ పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ దశల వారీగా ఖాళీ స్థలాల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. ముఖ్యంగా పీవీ ఘాట్ వద్ద ఉన్న మూడున్నర ఎకరాల స్థలంలో అందమైన, ఆకట్టుకునే రీతిలో మొక్కలను పెంచారు. రూ.41 లక్షలతో ఫ్లవర్ బెడ్స్, పాత్వేలు, హెడ్జ్ప్లాంట్స్, ల్యాండ్ స్కేప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. నగర నలుమూలల నుంచి వచ్చే వారు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు సైతం ఇక్కడి అందచందాలను చూస్తూ తన్మయత్వం పొందేలా సుందరీకరణ చేస్తున్నారు. ఇక్కడి నుంచే సంజీవయ్య పార్కులో ఉన్న అతి పెద్ద జాతీయ జెండాను చూసేలా ఏర్పాట్లు చేశారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు వీలుగా ట్రాక్ను నిర్మించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఐదు రకాల ఆర్టిఫిషియల్ జంతువుల రూపంలో గ్రీనరీ రూపొందించారు. ఇందులో ప్రధానంగా భారీ ఏనుగు రూపం ఎంతో ఆకట్టుకుంటున్నది. సుందరీకరణ పనుల్లో భాగంగా పెద్ద మొత్తంలో వివిధ రకాల మొక్కలు నాటినట్లు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు తెలిపారు.
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ పక్కనే ఉన్న ఏడు ఎకరాల స్థలంలో వాటర్ ఫ్రంట్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్ అయిన ముంబైకి చెందిన కిశోర్ ప్రధాన్ రూపొందించిన డిజైన్లతో ఈ ఉద్యానవనాన్ని సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు చురుగ్గా సాగుతున్నాయని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా, లాక్డౌన్ మూలంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా లేక్ ఫ్రంట్ పార్కులో ఏర్పాటు చేసే స్ట్రక్చరల్ డిజైన్ల తయారీ ఎంతో కీలకమైందని, వీటిని బయట తయారు చేయించి ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. వందలాది చెట్లను తొలగించకుండానే వాటి మధ్య నుంచే నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.
పాదచారుల ట్రయల్స్, వాటర్ చానల్ డెక్ విత్ సీటింగ్, గ్లాస్ డెక్ అండ్ లేక్ సైడ్ ఓవర్ ద వాటర్ బాడీ, ఇన్నోవేటివ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, పర్గోలాస్ విత్ సీటింగ్, ఉడెన్ సీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చని పార్కు నుంచి నీళ్ల మీదకు వెళ్లేందుకు వీలుగా.. ఎలివేటెడ్ వాక్ వే అనేది ఎంతో ప్రత్యేకమైందని అధికారులు పేర్కొంటున్నారు. స్ట్రక్చరల్ డిజైన్ల మీదుగా నడుచుకుంటూ.. నీళ్ల మీదకు వెళ్లి సాగర్ అందాలను చూడటం కొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు.